By ETV Bharat Andhra Pradesh Team
Published : May 31, 2024, 9:21 AM IST
|Updated : May 31, 2024, 9:49 AM IST
విజయవాడలో పెరుగుతున్న డయేరియా కేసులు - ఏడుకి చేరిన మృతులు సంఖ్య - DIARRHEA CASES
Increasing Diarrhea Death Cases Concerns in Vijayawada: విజయవాడలో డయేరియా లక్షణాలతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. మొగల్రాజపురంలో నివాసం ఉంటున్న వందల మంది వాంతులు, విరేచనాలతో 10 రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం రాత్రి మరో మహిళ మృతి చెందడంతో ఇప్పటివరకూ డయేరియా లక్షణాలతో మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరుకుంది. మొగల్రాజపురంలో డయేరియా లక్షణాలతో మెట్టు అంజమ్మ చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. అతిసార లక్షణాలతో పలువురు చికిత్స తీసుకుంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన ఆనంద్ అనే యువకుడు వాంతులు, విరోచనాలతో కుప్పకూలిపోయాడు. పాయకాపురం ప్రాంతంలో ఓ వృద్ధురాలు, బాలుడు అతిసార లక్షణాలతో చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. దీంతో విజయవాడలో అతిసార లక్షణాలతో మరణించిన వారి సంఖ్య ఏడుకి చేరింది.
వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు వద్దకు మందుల కోసం వచ్చిన ఆనంద్ మందులు తీసుకుని క్యాంప్ బయటకు వస్తుండగానే కుప్పకూలిపోయాడు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అధికారికంగా 60 కేసులు దాటగా, అనధికారికంగా 200 మందికి పైగా వ్యాధి బారిన పడినట్లు సమాచారం. నాలుగు రోజులుగా వైద్య ఆరోగ్యశాఖ మొగల్రాజపురంలో ఉచిత శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తూ చికిత్స అందిస్తోంది.