ఎన్టీఆర్ జిల్లాలో దారుణం - భార్యను కొండపై నుంచి కిందకు తోసి హత్య
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 5, 2024, 11:45 AM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-02-2024/640-480-20669400-thumbnail-16x9-husband-killed-wife-due-to-family-quarrels.jpg)
Husband Killed Wife due to Family Quarrels: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో భార్యను భర్త హత్య చేశాడు. కుటుంబ తగాదాల నేపథ్యంలో దంపతులు శనివారం ఇంటి నుంచి వెళ్లిపోయారు. సోమవారం వత్సవాయి మండలం భీమవరం సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న కోనగిరి మల్లికార్జున స్వామి కొండపై భార్య శవమై కనిపించింది. భర్త పోలీసుల అదుపులో ఉన్నాడు. పెనుగంచిప్రోలు తుఫాను కాలనీకి చెందిన పద్మాల సురేష్, త్రివేణి దంపతులు. వీరికి పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
గత కొంతకాలంగా కుటుంబ కలహాలు చోటు చేసుకోవడంతో భార్యాభర్తలిద్దరూ గొడవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం గుడికి వెళ్లి వస్తామని కుమారుడు, కుమార్తెతో చెప్పి దంపతులిద్దరూ ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లారు. రాత్రి అయినా రాకపోవటంతో పిల్లలు ఇద్దరు ఆందోళన చెందుతూ స్థానికంగా ఉన్న తాతయ్యకు చెప్పారు. అనుమానించిన వారు ఆదివారం రాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున భర్తను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా కోనగిరి మల్లికార్జున స్వామి కొండపై నుంచి కిందకు తోసి హత్య చేసినట్లు తెలిపాడు. అతని సమాచారం మేరకు కొండపైకి చేరుకున్న పోలీసులు మృదేహాన్ని కనుగొన్నారు.