అనుమానాస్పద రీతిలో రైతు మృతి - చెరువు వద్ద ఘర్షణలో ? - Farmer died in suspicious manner - FARMER DIED IN SUSPICIOUS MANNER
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 26, 2024, 4:34 PM IST
Farmer Died in Suspicious Manner in Clash: అనంతపురం జిల్లాలోని జంగం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. దుగుమర్రి చెరువు వద్ద జరిగిన ఘర్షణలో లక్ష్మీనారాయణ రెడ్డి (56) అనే రైతు మృత్యువాత పడగా పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం: జంగం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ రెడ్డి తన పొలంలో చినీ చెట్లు వేశాడు. పంటకు నీరు తక్కువ కావడంతో గత మూడు రోజుల క్రితం దుగుమర్రి చెరువులో బోరు వేశాడు. ఈరోజు మోటార్ బిగించుకుని పైప్లైన్ ద్వారా పంటకు నీరు పెట్టుకోవాలని పనులు చేసుకుంటుండగా తుంపెర మిద్దెలకు చెందిన గ్రామస్థులు అడ్డుకున్నారు. చెరువులో బోరు వేయరాదంటూ ఘర్షణకు దిగారు. చెరువు అందరిదీ ఎందుకు వేయరాదని లక్ష్మీనారాయణ వారితో వాదించాడు. ఈ క్రమంలో అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడని ప్రత్యర్థి వర్గీయులు చెబుతున్నారు.
అయితే ఘర్షణలో లక్ష్మీనారాయణ రెడ్డిని కిందికి పడవేసి దాడికి పాల్పడడంతోనే మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. లక్ష్మీనారాయణ రెడ్డి మృతదేహాన్ని నార్పల ప్రాథమిక వైద్యశాలకు తీసుకుని వచ్చారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహంపై ఎక్కడైనా గాయాలు ఉన్నాయా అని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య చౌడమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.