By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 4:53 PM IST
జగన్ మాట తప్పారు, మడమ తిప్పారు - అందుకే సమ్మె బాట : సెర్ప్ ఉద్యోగులు
Concerns of Serp Employees in Paderu of Alluri District : అల్లూరి జిల్లా పాడేరులో వైఎస్సార్ క్రాంతి పథకంలోని సెర్ప్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. తమ ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలంటూ డిమాండ్తో ర్యాలీ నిర్వహించారు. న్యాయమైన తొమ్మిది డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే కర్నూలు జల్లాలో డి.ఆర్.డి.ఎ - వై.ఎస్.ఆర్. క్రాంతి పథంలో పనిచేస్తున్న ఉద్యోగులు చేపట్టిన సమ్మె తొమ్మిదో రోజుకు చేరుకుంది.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పని చేస్తున్న తమను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రెగ్యులర్ చేస్తామని చెప్పి ఇప్పటికి నాలుగున్నర సంవత్సరాలు గడిచింది. అయినా నేటికి ఇచ్చిన హామీ నెరవేర్చనందుకే సమ్మె బాట పట్టామని జేఏసీ నాయకులు వెల్లడించారు. నిరసనలో భాగంగా దీక్ష శిబిరంలోని ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 23 సంవత్సరాల నుంచి పని చేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో సెర్ప్ ఉద్యోగులకు ఇచ్చిన విధంగా పేస్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే జగన్ సెర్ప్ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని బాపట్ల పట్టణంలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.