బాపట్ల జిల్లాలో ఓడల తయారీ క్లస్టర్! - పరిశీలించిన కేంద్ర బృందం
By ETV Bharat Andhra Pradesh Team
Published : 3 hours ago
Central Team Visit Bapatla District : బాపట్ల జిల్లా చినగంజాం మండలం పెదగంజాం పంచాయతీ పరిధిలోని పల్లెపాలెం, ఏటిమొగ ప్రాంతాలను కేంద్ర బృంద సభ్యుడు సుబ్బారావు పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్తో సహా ఐదు రాష్ట్రాల్లో ఓడల తయారీ క్లస్టర్ల ఏర్పాటుకు ఇటీవల కేంద్రం సముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అందుకు అనువైన భూములు చినగంజాం మండలంలో ఉన్నాయని, అక్కడ ఏర్పాటు చేయాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను కలిసి అభ్యర్థించారు. దీంతో పెమ్మసాని మంత్రిత్వశాఖలోని ఉన్నతాధికారులతో చర్చలు జరిపి ఓ బృందాన్ని చినగంజాం పంపడానికి చొరవ తీసుకున్నారు.
కేంద్ర ఓడరేవులు, నౌకాయాన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల బృందం ఓడల నిర్మాణం కోసం చినగంజాం మండలంలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసే కార్యక్రమంలో భాగంగా కేంద్ర బృంద సభ్యుడు సుబ్బారావు పెదగంజాం ప్రాంతంలోని తీర ప్రాంతాన్ని పరిశీలించారు. మొదటగా ఏటిమొగ గ్రామంలోని రొంపేరు కాలువని పరిశీలించారు. ప్రభుత్వ భూములు, ఇతర భూముల వివరాలను అధికారులు వివరించారు. స్థానికులతోనూ మాట్లాడారు. తర్వాత పడవలో వెళ్లి పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందచేస్తానని సుబ్బారావు తెలిపారు.