By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 22, 2024, 1:56 PM IST
వీఎంసీ ఓపెన్ డ్రైనేజీలో పడి ఆటోడ్రైవర్ మృతి - మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని సీపీఎం డిమాండ్
Auto Driver Died Falling into Open Drainage in Vijayawada : ఓపెన్ డ్రైనేజీలో పడి ఓ ఆటో డ్రైవర్ మృతి చెందిన సంఘటన విజయవాడలో జరిగింది. స్థానిక వాంబే కాలనీలో ఆటో నడుపుతూ జీవనం సాగించే కదిరి అప్పన్న వీఎంసీ (Vijayawada Municipal Corporation) ఓపెన్ డ్రైనేజీలో పడి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబురావు పరామర్శించారు. ఈ సంఘటనకు నగరపాలక సంస్థ బాధ్యత వహించాలని బాబురావు డిమాండ్ చేశారు.
గతంలో ఇదే ప్రాంతంలో చాలా ప్రమాదాలు జరిగినా నగరపాలక సంస్థ రక్షణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం అయ్యారని బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుటికైనా వీఎంసీ అధికారులు ఔట్ పాల్ డ్రైనేజీలపైన మూతలను ఏర్పాటు చేయాలని కోరారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహయం చేయాలని డిమాండ్ చేశారు.