ఎన్నాళ్లీ డోలీ మోతలు - ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గిరిజనులు - NO ROADS IN TRIBAL AREAS - NO ROADS IN TRIBAL AREAS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 21, 2024, 5:17 PM IST
Adivasis Fire on Government Due to No Road Facility : నేటి ఆధునిక సమాజంలో చిన్న గల్లీ నుంచి దిల్లీ వరకు అన్ని ప్రాంతాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. అన్ని చోట్ల మౌలిక సదుపాయాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీల దుస్థితి చూస్తే మనసు చలించక తప్పదు. తాజాగా మన్యం జిల్లాలో పురిటి నొప్పులతో బాధ పడుతున్న ఓ మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో డోలీ కట్టి తీసుకెళ్లిన ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది.
తమ గ్రామంలో రహదారి సౌకర్యం లేక అత్యవసర సమయాల్లో డోలీ మోతలు తప్పడం లేదంటూ గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన్యం జిల్లా కొమరాడ మండలం గిరిశిఖర గ్రామానికి చెందిన నిండు గర్భిణికీ ప్రసవ నొప్పులు రావటంతో గ్రామస్థులు ఆరు కిలో మీటర్లు డోలీలో మైదాన ప్రాంతానికి మోసుకెళ్లాల్సి వచ్చింది. ఎవరికీ అనారోగ్యం వచ్చినా 15 కిలో మీటర్లు డోలీలో మోసుకెళ్లాల్సిందేనని బాధితులు తెలిపారు. ఈ మార్గంలో రహదారి నిర్మిస్తామని హామీ ఇచ్చిన నాయకులు ఒక కిలో మీటరు మాత్రమే చదును చేసి వదిలేశారని బాధితులు వాపోయారు.