Voters Day Awareness Program in Andhra Pradesh: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకం. నేతల తలరాతలు మార్చేది, ప్రజలకు నచ్చిన వ్యక్తికి పట్టం కట్టేదీ ఓటే. ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో సామాన్యుడి వజ్రాయుధం ఓటే. మనల్ని ఎవరు పరిపాలించాలో నిర్ణయించుకునే సదావకాశం ఓటు ద్వారా నిర్ణయించబడుతుంది. ఈ రోజు ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని ఓటు ప్రాధాన్యం, నమోదు, ఓటు వినియోగంపై కృష్ణా జిల్లా నాగాయలంకలో తహసీల్దార్ జె. విమలకుమారి అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత యువతరంపై ఉందని, అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు నమోదు చేసుకుని వినియోగించుకోవాలని తెలిపారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భారీర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు విమలకుమారి సూచించారు. ఓటు హక్కుతో మంచి నాయకులను ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు.
'రాజ్యాంగం సామాన్యుడికిచ్చిన వజ్రాయుధం ఓటుహక్కు'
National Voters Day Rally Held Annamayya District: అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఆర్డీవో రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆర్డీఓ ఆఫీస్ నుంచి పాత బస్టాండ్ వరకు విద్యార్థులు, అధికారులు ర్యాలీ చేపట్టారు. అనంతరం విద్యార్థులతో కలిసి మానవహారంగా ఏర్పడి ఓటు హక్కుపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఓటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఓటు ఎవరు అమ్ముకోవద్దని మీకు నచ్చినవారికి ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధి, దేశం కోసం పాటు పడాలని రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు ఓటు గురించి అవగాహన కల్పించి, అధికారులు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించామని ఆర్డీవో రామకృష్ణారెడ్డి తెలిపారు. ఓటేద్దాం ఓటేద్దాం కచ్చితంగా ఓటేద్దాం అని పిలుపునిచ్చారు. సమాజ మార్పునకు యువత ముందుకు రావాలని కోరారు. ఓటు ద్వారా సమసమాజ స్థాపనకు కృషి చేయాలని తెలిపారు.
నేషనల్ ఓటర్స్ డే 2024- ఈ సారి థీమ్ ఏంటంటే?
Students Rally in YSR Kadapa District: వైఎస్సార్ జిల్లా కమలాపురం మండల రెవెన్యూ కార్యాలయం నుంచి కమలాపురం గ్రామ చావిడి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రెవెన్యూ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. డిగ్రీ కళాశాల విద్యార్థులు, గురుకుల పాఠశాల విద్యార్థులు కలిసి ర్యాలీ నిర్వహించారు. మంచి భవిష్యత్తుకు ఓటు వేయటం మెుదటి మెట్టు, బులెట్ కన్నా బ్యాలెట్ విలువైనది అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు.
'ఈవీఎంలను గౌరవిస్తేనే దేశంలో సమానత్వం'
Konaseema District: కోనసీమ జిల్లా అంబాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్థానిక రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓటు అంశంపై ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అంబాజీపేట తహసీల్ధార్ నాగపద్మ లక్ష్మీ తెలిపారు. ముగ్గుల పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి, సీనియర్ ఓటర్లను సత్కరించారు.