Mumbai Actress Kadambari Jethwani Case Updates : ముంబయి నటి కాదంబరీ జత్వానీ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, ఆమెను వేధించిన పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విజయవాడలో పని చేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం.సత్యనారాయణలను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ఐపీఎస్లు పి. సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. నేడో రేపో ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశముంది.
వారిపై కేసు నమోదు చేయాలన్న ముంబయి నటి : మరోవైపు ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు నమోదు చేసి, అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో అప్పటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్గున్ని, వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్లపై కేసు నమోదు చేయాలని కాదంబరీ జత్వానీ ఫిర్యాదు చేశారు. వీరంతా కుమ్మక్కై చట్టవిరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. శుక్రవారం రాత్రి తన న్యాయవాదులు పీవీజీ ఉమేష్ చంద్ర, పాల్తో కలసి ఆమె విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం స్టేషన్కు వెళ్లారు. సీఐ చంద్రశేఖర్కు ఈ మేరకు ఆమె ఫిర్యాదును అందజేశారు. ఆమె వెంట తండ్రి నరేంద్ర కుమార్ జత్వానీ, తల్లి ఆశా జత్వానీ ఉన్నారు.
ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముంబయి నటి ఫిర్యాదు మేరకు కుక్కల విద్యాసాగర్, మరికొందరిని నిందితులుగా పేర్కొన్నారు. 192, 211, 218, 220, 354, 467, 420, 469, 471, రెడ్విత్ 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిన్న ఇబ్రహీంపట్నం పీఎస్కు వెళ్లి వివరాలు అందించిన ముంబయి నటి, నేడు కూడా పోలీసుస్టేషన్కు వెళ్లారు. సీఐకి మరిన్ని వివరాలు అందించారు.
ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారంటే?: కాగా విద్యాసాగర్తో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి, హుటాహుటిన అక్రమంగా కేసు నమోదు చేసి, తనతో పాటు తల్లిదండ్రులను ముంబయిలో అరెస్టు చేశారని ఫిర్యాదులో అందులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఆగమేఘాలపై ముంబయి వచ్చి ముగ్గుర్ని అరెస్టు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. కస్టడీకి తీసుకున్న ఐదు రోజులూ తన పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, అర్ధరాత్రి కూడా ఇంటరాగేషన్ చేశారని వివరించారు. ఏ తప్పూ చేయకపోయినా తమ కుటుంబం 42 రోజుల పాటు విజయవాడ కారాగారంలో ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారకులైన ఐపీఎస్ అధికారులు, విద్యాసాగర్పై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో నటి కాదంబరి కోరారు.
దీనిపై ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్ స్పందిస్తూ, ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకుని, కేసు నమోదు చేస్తామని ఆమెకు చెప్పారు. నిబంధనల ప్రకారం తాము ఎస్హెచ్వోకు ఫిర్యాదు చేశామని, తమకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై నమ్మకం ఉందని న్యాయవాది ఉమేష్చంద్ర అన్నారు.