Tirumala Laddu Issue Updates : తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విషయంపై రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు స్పందిస్తున్నాయి. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం స్పందించిన చంద్రబాబు దీనిపై నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలరావును ఆదేశించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
టీటీడీ అత్యవసర సమావేశం : ఈ నేపథ్యంలోనే శనివారం లడ్డూ అపవిత్రంపై టీటీడీ ఈవో శ్యామలరావు అత్యవసర సమావేశం నిర్వహించారు. తిరుపతి పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. లడ్డూ అపవిత్రం నేపథ్యంలో సంప్రోక్షణపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో అదనపు ఈవో వెంకయ్యచౌదరి, ప్రధాన అర్చకుడు, ఆగమ పండితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మరోవైపు కల్తీ నెయ్యి వివాదంలో టీటీడీ ఈవో నివేదికగా కీలకంగా మారింది. శనివారం సాయంత్రం ఆయన చంద్రబాబును కలవనున్నారు. ఈవో నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది. ఈ వ్యవహారంపై ఆగమ, వైదిక శాస్త్ర పండితులతో పాటు ధార్మిక పరిషత్ పెద్దలతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఆలయశుద్ధి, సంప్రోక్షణ చేపట్టాలని నిర్ణయం తీసుకోనున్నారు. ధార్మిక పరిషత్ పెద్దల సూచనల మేరకు ముందుకు వెళ్లాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై దేవాదాయశాఖ కూడా అప్రమత్తమైంది.
Animal Fat In Tirumala Laddu : తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీపై తిరుపతి జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తిరుమల పవిత్రతను, ప్రసాదాన్ని వైఎస్సార్సీపీ నేతలు అపవిత్రం చేశారని కిరణ్ రాయల్ ఆరోపించారు. ఇందులో భాగంగా జగన్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి దేవదేవుడి ప్రసాదాన్ని కల్తీ చేశారని మండిపడ్డారు. ఆలయాన్ని, శ్రీవారి పోటును సంప్రోక్షణ చేయాలని తెలిపారు. కల్తీ నెయ్యి కొనుగోళ్లలో మాజీ ఈవో ధర్మారెడ్డి కీలకమని చెప్పారు. ఈ వ్యవహారంలో మాజీ ఛైర్మన్, టీటీడీ ఉన్నతాధికారులను అరెస్ట్ చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.