Telangana Governor Resigns : గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. రాష్ట్ర గవర్నర్ పదవితో పాటు అదనపు బాధ్యతల్లో ఉన్న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికీ రాజీనామా చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు వీలుగా తమిళిసై రాజీనామా చేసినట్లు సమాచారం. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ ఉదయం గవర్నర్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనంతరం రాజీనామాపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందరరాజన్, 2019 సెప్టెంబర్ 8న రాష్ట్రానికి గవర్నర్గా వచ్చారు. 2021 ఫిబ్రవరి 18వ తేదీ నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గానూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పని చేసిన తమిళిసై, 2019 ఎన్నికల్లో తూత్తుకుడి నుంచి లోక్సభకు పోటీ చేసిన కరుణానిధి కుమార్తె కణిమొళిపై ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర గవర్నర్గా భారత రాష్ట్రపతి నియమించారు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో తమిళిసై సౌందరరాజన్ మళ్లీ పోటీ చేస్తారని గత కొంత కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ, నేడు ఉదయం గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. చెన్నై సెంట్రల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో తమిళిసై సౌందరరాజన్ పోటీ చేసే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు తమిళిసై చెన్నై వెళ్లనున్నారు.