A Serious Road Accident in Annamayya District : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రైల్వేకోడూరులో కారు-ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. రాజా నగర్ వద్ద ఇన్నోవా కారును ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు వేగంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మొదట అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు గాయపడిన వారందరనీ హుటహుటిన రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. తిరుపతిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
చనిపోయిన వారంతా కర్నూలుకు చెందిన వారిగా గుర్తించారు. వివాహ రిసెప్షన్ నిమిత్తం కర్నూలు నుండి తిరుపతికి ఇన్నోవా కారులో వెళ్తుండగా, తిరుపతి నుండి కడపకు వస్తున్న ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారు రావూరి ప్రేమ్ కుమార్(51), రావూరి వాసవి (48), కామిశెట్టి సుచరిత(45) గా గుర్తించారు. చనిపోయిన వారు గాయపడిన వారందరూ ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.