Prabhala Theertham Celebrations in Konaseema District : కనుమ పండుగ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభల ఉత్సవాలు సాగాయి. కోనసీమ జిల్లాలోని అంబాజీపేట, అమలాపురం, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐ.పోలవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, కొత్తపేట, పి.గన్నవరం, మామిడికుదురు, రాజోలు, సఖినేటిపల్లి మండలాల్లోని 170 గ్రామాల్లో భక్తి శ్రద్ధలతో, ఉత్సాహంగా ప్రభల తీర్థం సాగింది.
అంబాజీపేట మండలం వాకలగరువు, తొండవరం, గున్నేపల్లి అగ్రహారం ప్రభలు రాష్ట్రంలోనే ఎత్తైన ప్రభలుగా గుర్తింపు పొందాయి. అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో 423 ఏళ్లుగా క్రమం తప్పకుండా ప్రభలతీర్థం నిర్వహిస్తుండగా.. టన్నుల కొద్దీ బరువున్న ప్రభలను జగ్గన్నతోట తీర్థ స్థలికి యువకులు, గ్రామస్థులు భుజాలపై మోసుకొచ్చారు. భక్తజనులు వాటి వెంట తరలిరాగా మేళతాళాల మధ్య ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. కనుమ రోజున ఏకాదశ రుద్రులు కొలువుదీరేది దేశం మొత్తం మీద జగ్గన్నతోటలోనే అన్నది భక్తుల విశ్వాసం.
గంగలకుర్రులోని పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి, గంగలకుర్రు అగ్రహారంలోని ఉమా పార్వతీ సమేత వీరేశ్వరస్వామి వారి ప్రభలు స్థానికంగా ఉన్న అప్పర్ కౌశకి నది దాటి వచ్చే సన్నివేశాలను.. తిలకించేందుకు భక్తులు వేలాదిగా పోటెత్తారు. భారీగా వచ్చిన భక్తులతో జగ్గన్నతోట తీర్థానికి వచ్చే అన్ని దారుల్లోనూ ట్రాఫిక్స్తంభించింది. ముక్కామల, పుల్లేటికుర్రు, అంబాజీపేట మార్గాల్లో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. ప్రభలు తిరిగి గ్రామాలకు వెళ్లేందుకూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సంక్రాంతి సంబరాల్లో చివరిదైన కనుమ పండుగ రోజున ఏపీ వ్యాప్తంగా గోపూజలు ఘనంగా నిర్వహించారు. గోవులను శుభ్రంగా కడిగి, వాటి నుదుటన బొట్టుపెట్టి, కాళ్లు, వీపుపై భాగంలో పసుపు, కుంకుమతో అలంకరించి ప్రత్యేకంగా పూజలు చేశారు. పండుగ మూడో రోజున పిల్లలు, పెద్దలు ఆటపాటలతో సందడిగా గడిపారు.