Frauds In the Name of Marriage: మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యే ప్రయత్నంలో యువతీ, యువకులు మాయగాళ్ల బారిన పడి మోసపోతున్నారు. మ్యాట్రిమోనీ వేదికలను అడ్డాగా మార్చుకుని నకిలీ ఫొటోలు, అడ్రెస్లతో బురిడీ కొట్టిస్తున్నారు. మరోవైపు కొందరు కిలేడీలు తామే కాబోయే పెళ్లి కూతుళ్లమంటూ అబ్బాయిలకు దగ్గరై భారీగా డబ్బులు దోచేస్తున్నారు. ఎవరైనా నిలదీస్తే పెళ్లి పేరిట తమనే మోసగించారంటూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు.
పెళ్లిపేరిట మోసపోయామంటూ ఇప్పటికే భారీగా ఫిర్యాదులు అందాయి. నేరుగా వధూవరులను చూడకుండా పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవద్దని, డబ్బులు ముందుగానే కావాలంటున్నారంటే మోసపోతున్నట్లే గుర్తించాలని పోలీసులు సూచిస్తున్నారు. సోషల్ మీడియా, వెబ్సైట్లలో నకిలీ ప్రొఫైల్స్తో మోసాలకు పాల్పడే ముఠాలు 2 రకాలుగా బురిడీ కొట్టిస్తున్నారు. కొందరు విదేశాల్లో ఉంటున్న ఎన్ఆర్ఐలుగా పరిచయం చేసుకుంటారు. మరో తరహా కేటుగాళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఫలానా కుటుంబాలకు చెందిన వారిగా పరిచయం చేసుకుంటారు.
ఎన్నో రకాలుగా:
- పెళ్లై 20 రోజులు కాకుండానే పుట్టింటికి: విజయవాడకు చెందిన యువతితో తెలంగాణలోని బోడుప్పల్కు చెందిన ప్రైవేటు ఉద్యోగికి పెళ్లి కుదిరింది. అతడికి 40 వయసు దాటడంతో అమ్మాయి తరఫు కుటుంబానికి ఎదురు లాంఛనాలిచ్చి మరీ ఘనంగా వివాహం చేసుకున్నాడు. పెళ్లై 20 రోజులు కాకుండానే భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో ఉలిక్కిపడ్డాడు. ఆమెను తీసుకొచ్చేందుకు అత్తారింటికెళ్తే, మా అమ్మాయి కాపురానికి రాదంటూ వారు తేల్చిచెప్పారు. వేధిస్తున్నావంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, ఇవేమీ లేకుండా ఉండాలంటే 5 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ తేల్చిచెప్పారు. దీంతో బాధితుడు ఆ అమ్మాయి గురించి ఆరా తీయటంతో అసలు విషయం బయటపడింది. ఇదే తరహాలో ఆ యువతి కుటుంబసభ్యులు ఇప్పటికే నలుగురిని మోసం చేసినట్లు తెలుసుకున్నాడు.
- కాబోయే అల్లుడే కదా ఇస్తే: వధూవరులిద్దరూ ఒకరికొకరు ఇష్టపడ్డారు. ఇంకేముంది పెళ్లి కుదిరిందనే సమయంలో అసలు రూపం చూపిస్తారు. అటువైపు ఉన్నది అబ్బాయిలైతే ముందుగానే డబ్బులు ఇస్తే కొత్త దుస్తులు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తామంటూ డ్రామా ఆడతారు. ఎలాగూ కాబోయే అల్లుడే కదా అని అడిగినంత డబ్బులు ఇవ్వగానే మరుసటిరోజే ముఖం చాటేస్తారు.
- పెళ్లిచూపులు ఏర్పాటు చేసి పరిచయం చేస్తారు: మ్యాట్రిమోనీల నిర్వాహకులు కొందరు యువతులకు కమీషన్ ఆశచూపి వధువుగా పరిచయం చేస్తారు. హోటల్, కాఫీ షాపులలో పెళ్లిచూపులు ఏర్పాటు చేసి అబ్బాయిలకు పరిచయం చేస్తారు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగిన తరువాత, పుట్టినరోజు వేడుకలు, షికార్లు అంటూ అతడి నుంచి అందినంత సొమ్ము దండుకున్నాక అమ్మాయికి అతడి ప్రవర్తన నచ్చలేదంటూ తేల్చిచెబుతారు.
- 3 నెలల్లోనే నాలుగున్నర లక్షల రూపాయలు: ఇటీవలే మణికొండకు చెందిన ఓ యువతి పెళ్లయిన సంవత్సరానికే భర్త నుంచి విడిపోయారు. మరో వ్యక్తి కోసం వెతికే క్రమంలో మ్యాట్రిమోనీ వెబ్సైట్లో ఓ వ్యక్తి ప్రొఫైల్ చూసి వివరాలు సేకరించారు. ఇద్దరి మధ్య కొద్దిరోజులు ఛాటింగ్స్, మాటలు జరిగిన తరువాత తన బ్యాంకు అకౌంట్ నిలిపివేశారని, ఇతర కారణాలు చూపుతూ 3 నెలల్లోనే నాలుగున్నర లక్షల రూపాయలు కాజేశాడు. ఆ తరువాత ఫోన్ స్విచ్చాఫ్ చేసేశాడు. నిందితుడు వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిగా తేలింది.
ఇలాంటి తరహా మోసాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని పోలీసులు అంటున్నారు. అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సంబంధాలు కుదుర్చుకోవాలని సూచిస్తున్నారు.
పెళ్లి కాని ప్రసాద్లు జాగ్రత్త - ఆదమరిస్తే అంతేసంగతులు
'పెళ్లి కూతురు'లా పరిచయం - బుల్లెట్ బండెక్కి షికారు వెళ్లాక బయటపడింది!