CM Chandrababu on Nominated Posts: జూన్లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి నిన్న మొన్న వచ్చి చేరిన వారి కంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పని చేసిన వారిని నేతలు ప్రోత్సహించాలన్నారు. మొదటి నుంచి పార్టీని నమ్మకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని తేల్చిచెప్పారు. 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయని, రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తామన్నారు. పదవి పొందినవాళ్ల రెండేళ్ల పనితీరుపై సమీక్ష చేస్తామన్న చంద్రబాబు, దాని ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయని వివరించారు.
పార్టీని నమ్ముకున్న వారికే పదవులు: వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవి ఆశిస్తున్న వాళ్లు క్యూబ్స్ (క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్) విభాగాల్లో సభ్యులుగా ఉండాలన్నారు. కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని వెల్లడించారు. తెలుగుదేశం ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇంఛార్జ్లతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పనితీరు వంటి అంశాలపై ఇందులో చర్చించారు. క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ (CUBS)లో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులకు సిఫారసులు చేయాలని నేతలకు సూచించారు. ప్రభుత్వ పని తీరును నిరంతరం పర్యవేక్షించుకుంటూ, మెరుగుపరుచుకుంటూ పని చేయాలని దిశానిర్దేశం చేశారు. 2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని తేల్చిచెప్పారు.
సభ్యత్వ నమోదులో బాగా పనిచేసిన వారిని పదవులు: 7 నెలల కాలంలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ది పనులు చేపట్టామన్న చంద్రబాబు, ఈ విషయాలను నిరంతరం ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తామని, విషయంలో వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని నేతలకు సూచించారు. టీడీపీ సభ్యత్వ నమోదులో బాగా చేసిన వారికి పదవుల్లో ప్రోత్సాహం ఇస్తామన్నారు.
కష్టకాలంలో పార్టీకి అండ - నామినేటెడ్ పదవులలో ప్రాధాన్యం
కార్పొరేషన్ పదవుల్లో కార్యకర్తలకు ప్రాధాన్యం - పూర్తి లిస్ట్ ఇదే - CORPORATION POSTS FILLED