Janasena Pawan Kalyan Comments: రాబోయే తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం ఇప్పుడున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ఇప్పుడున్న పథకాలకు అదనంగా డబ్బులు జోడించి ఇస్తామే తప్ప వాటిని రద్దు చేసే ఆలోచనే లేదన్నారు. ప్రమాదంలో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ చెక్కులు అందజేశారు. 20 మంది కార్యకర్తల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించారు.
పేదలకు జగన్ ఏనాడు తన సొంత జేబులోంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని పవన్ విమర్శించారు. డ్వాక్రా మహిళల సమస్యలు పరిష్కారానికి అధ్యయనం చేస్తున్నామన్నారు. డ్వాక్రా మహిళలకు అండగా ఉంటామని పవన్ చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్న 5 లక్షల రూపాయలు కష్టంలో ఉన్నప్పుడు తాము ఉన్నాము అనే చిరు ప్రయత్నం మాత్రమే అని పేర్కొన్నారు. ఈ సహాయం ఇక్కడితో ఆగదని స్పష్టం చేశారు.
కార్యకర్తల సంక్షేమానికి సహాయం అందిస్తున్న పార్టీ జనసేన ఒక్కటేన్నారు. అధికారానికి మానవత్వం తోడైతే ఇంకా మరిన్ని అద్భుతాలు చేయవచ్చన్నారు. కార్యకర్తల కోసం సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 226 మంది జనసైనికుల కుటుంబ సభ్యులకు బీమా సొమ్ములు అందించామని పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. మొత్తం 10.30 కోట్ల రూపాయల సహాయం చేశామని నాదెండ్ల తెలిపారు. మూడు నెలలకు గాను పవన్ సొంత నిధుల నుంచి 3.5 కోట్లు ఇచ్చారని అన్నారు.
"శాంతియుత వాతావరణంలో ఎలక్షన్లు జరగాలి - వారు ఎన్నికల పక్రియకు హాని"
చెక్కులు ఇచ్చేటపుడు నా గుండె బాధపడుతోందని పవన్ కల్యాణ్ తెలిపారు. చాలా సార్లు అనేక మంది గాయపడ్డారని, ఇది ఆశయం కోసం చేస్తున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సహాయం ఇక్కడితో ఆగదన్న పవన్, కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు ఉమ్మడి నిధి ఏర్పాటు చేసే ఆలోచన ఉందని చెప్పారు.
గాయపడ్డవారికి 50 వేల రూపాయలు ఇస్తున్నామన్న పవన్, దేశంలో కొండంత సహాయం చేస్తున్నామని తెలిపారు. అధికారానికి, మానవత్వానికి సంబంధం లేదని పేర్కొన్నారు. మానవత్వానికి అధికారం తోడైతే చాలా అద్భుతాలు జరుగుతాయని చెప్పారు. దుర్ఘటన జరిగిన వెంటనే నాయకులు స్పందిస్తే తొందరగా సహాయం అందిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.
తన సంపాదనను ప్రజలకు పంచేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానన్న పవన్, జనసేన - టీడీపీ ప్రభుత్వం వస్తే ఎంత ఉదారంగా ఇవ్వగలమో చూపిస్తామని స్పష్టం చేశారు. జేబులో నుంచి రూపాయి కూడా ఇవ్వలేని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. టీడీపీ - జనసేన ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పుడు ఉన్న పథకాలు ఎట్టి పరిస్థితిల్లో ఆగవు అని, ఇంకా అదనంగా డబ్బులు జోడించి ఇస్తామని అన్నారు.
పదేళ్ల పాటు జగన్ను రాజకీయాల వైపు చూడకుండా చేయాలి: పవన్ కల్యాణ్