EC CLARIFICATION TO HIGH COURT ON JANASENA GLASS SYMBOL TO INDEPENDENT : జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తు రిజర్వు చేసే అంశంపై హైకోర్టుకు ఎన్నికల సంఘం నివేదిక సమర్పించింది. జనసేన పార్టీ పోటీ చేసే ఎంపీ స్థానాల పరిధిలో అసెంబ్లీ సీట్లలో గాజుగ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించబోమని అలాగే ఆ పార్టీ పోటీ చేసే అసెంబ్లీ స్థానాల పరిధిలోని ఎంపీ స్థానాల్లోనూ అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తును కేటాయింపు ఉండదని స్పష్టం చేసింది. ఇతర అసెంబ్లీ స్థానాల్లో మాత్రం గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్గా ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలో 63 చోట్ల ఇప్పటికే గాజు గ్లాసు గుర్తును కేటాయించిన క్రమంలో కోర్టు ఉత్తర్వుల మేరకు మార్పు చేర్పులు చేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. మార్పు చేర్పులు చేసి పోటీ చేస్తున్న అభ్యర్ధులకు ప్రత్యామ్నాయ ఎన్నికల చిహ్నాలను కేటాయించాలని ఆదేశాలిచ్చింది. ఎన్నికల గుర్తుల నియమావళి 1968 లోని 10బి నిబంధన ప్రకారం జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసుని 175 నియోజకవర్గాల్లోనూ కామన్ సింబల్గా కేటాయించామని ఈసీ స్పష్టం చేసింది.
JANASENA GLASS SYMBOL TO INDEPENDENTS : రాష్ట్రంలో జరగనున్న లోక్సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించి ముందుగా గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ గా ఇచ్చినప్పటికీ ఆ జాబితా నుంచి తొలగించాలని, ఇతరులకు కేటాయించొద్దని జనసేన పార్టీ నుంచి అందిన వేర్వేరు అభ్యర్థనల మేరకు ఆ గుర్తును 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ కామన్ సింబల్గా గుర్తించామని ఈసీ తెలిపింది. జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో ఫ్రీ సింబల్ గా ఉన్న గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయిస్తే ఓటర్లలో గందరగోళం తలెత్తుతుందన్న ఆందోళనను జనసేన పార్టీ వ్యక్తం చేసిందని ఈసీ వెల్లడించింది.
జనసేనకు గ్లాసు సింబల్ కేటాయిస్తూ ఈసీ ఆదేశాలు - Janasena Glass Symbol
గ్లాసు గుర్తు కేటాయింపునకు సంబంధించి హైకోర్టులోనూ జనసేన పార్టీ రిట్ పిటిషన్ దాఖలు చేసిందని ఈసీ పేర్కొంది. ఈ గందరగోళాన్ని సరిచేసేలా 24 గంటల వ్యవధిలోనే చర్యలు తీసుకున్నట్లు హైకోర్టుకు ఎన్నికల సంఘం వివరించింది. ఎన్నికల చిహ్నాల నియమావళిలోని 18బి, 18సి నిబంధనల మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం జనసేన పోటీ చేస్తున్న శాసనసభ, లోక్ సభ నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకి రిజర్వు చేసేలా నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది.
ఈసీ ఉత్తర్వులు మరింత గందరగోళం: నేడు విచారణ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నందున జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో ఇతరులెవరికీ కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని టీడీపీ అత్యవసరంగా హైకోర్టులో వ్యాజ్యం వేసింది. గాజు గ్లాసు గుర్తును జనసేనకే రిజర్వు చేయాలని కోరింది. స్వతంత్ర అభ్యర్థులెవరికీ గాజు గ్లాసు గుర్తును కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని కోరింది. టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఈ వ్యాజ్యాన్ని సమర్పించారు. ఈసీ తాజా ఉత్తర్వులు ఓటర్లను మరింత అయోమయానికి గురిచేసేలా ఉన్నాయన్నారు. గురువారం ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారించనుంది. ‘అభ్యర్థుల పేర్లను చదవలేని నిరక్షరాస్యులైన ఓటర్లు పార్టీ గుర్తును బట్టి ఓటేస్తారు. గాజు గ్లాసు గుర్తును నిబంధనల ప్రకారం ఈసీ జనసేనకు కేటాయించింది. ఈ గుర్తును ‘ఫ్రీ సింబల్ లిస్ట్’లోనూ చేర్చడం వల్ల ఇబ్బందులపై జనసేన పోరాడింది. ఆ తరువాత ఈసీ తీసుకున్న నిర్ణయం ఇబ్బందులను తొలగించకపోగా.. కూటమి అభ్యర్థులపై ప్రతికూల ప్రభావం చూపనుంది’ అని పిటిషన్లో పేర్కొన్నారు.