Raja Sankranti 2024 Odisha : రుతుస్రావం గురించి బహిర్గతంగా మాట్లాడటానికి ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఆలోచిస్తారు! అలాంటిది మరో జన్మను ప్రసాదించడానికి దోహదపడే ఈ ప్రక్రియను గౌరవించి, మహిళల గొప్పతనాన్ని గౌరవించడానికి ఓ పండుగ ఉందని తెలుసా? అదే రజా పర్బా. దీనికి మిథున సంక్రాంతి అనే పేరూ ఉంది. ఒడిశాలో నిర్వహించే ఈ పండుగ మూడు రోజుల పాటు జరుగుతుంది. శుక్రవారమే వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ మూడు రోజులు మహిళలను, ప్రకృతిని పూజిస్తారు.
అసలు ఎందుకు చేస్తున్నారు?
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భూమాత భవిష్యత్ వ్యవసాయ కార్యకలాపాలకు తనను తాను సిద్ధం చేసుకుంటుందని (భూమాతకు రుతుస్రావం జరుగుతుందని) నమ్ముతారు అక్కడి ప్రజలు. దీంతో నేల సారవంతంగా మారి పంటలు వేయడానికి అనుకూలంగా మారుతుందని భావిస్తారు. అందుకే పిండి వంటలు, కాలానుగుణంగా లభించే పళ్లను నైవేద్యంగా పెట్టి భూమాతకు ప్రత్యేక పూజలు చేస్తారు ఒడిశా వాసులు.
ఈ పండగ ఒడిశాలోని వ్యవసాయ పనులు ప్రారంభానికి సూచనగా చెప్పొచ్చు. జూన్ మధ్యలో రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి తొలకరి జల్లులు కురుస్తాయి. దీంతో అప్పటివరకు ఎండిన నేల తేమగా మారుతుంది. పంటలు వేయడానికి సిద్ధమవుతుంది.
ఇది మాకు పెద్ద పండుగ : బీజేపీ ఎంపీ అపరాజిత
భువనేశ్వర్లో రజా పర్బా వేడుకలను బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి ప్రారంభించారు. ఈ మేరకు మాట్లాడిన ఆమె, ఒడిశాలో రజా పర్బా మహోత్సవం చాలా పెద్ద పండుగ అని తెలిపారు. 'బాలికలు, మహిళలు ఈ పండుగ సందర్భంగా చాలా ఎంజాయ్ చేస్తారు. వారు మూడు రోజులు సెలవుల్లో ఉంటారు. ఈ పండుగ మా సాంస్కృతి, సంప్రదాయంతో మమేకమై ఉంది. రజా మహోత్సవాన్ని అన్ని చోట్లా ప్రమోట్ చేయాలి' అని తెలిపారు.
మూడు రోజులు ఇంటి పనుల నుంచి విముక్తి
అలాగే ఆ మూడు రోజుల పాటు మహిళలు ఎలాంటి ఇంటి పనులు చేయరు. చేతులకు గోరింట, కాళ్లకు పారాణి పెట్టుకుంటారు. ఇంటింటా పిండి వంటకాలు, నూతన వస్త్రధారణ, గడసరి పిల్లల అల్లరి, కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలు, అల్లుళ్ల సందడి, ఉయ్యాల జంపాల, కబడ్డీ ఆటలు, అమ్మాయిల షికార్లు, మిఠాపాన్ల మజా, బోటు షికార్లు, సినిమాలు, చిన్నారుల తుళ్లింతలతో రజా పండగ సందడిగా జరుగుతుంది
రజా అంటే
రజా అనే పదం రజస్వల నుంచి వచ్చింది. దీనికి రుతుస్రావం అయిన మహిళ అని అర్థం. మధ్యయుగ కాలంలో ఈ పండుగ వ్యవసాయ సెలవు దినంగా ప్రాచుర్యం పొందింది. ఇది జగన్నాథ స్వామి భార్య అయిన భూదేవి ఆరాధనను గుర్తుచేస్తుంది. పూరీ ఆలయంలో భూదేవి వెండి విగ్రహం జగన్నాథ స్వామి పక్కన ఇప్పటికీ ఉంది.
ప్రముఖుల శుభాకాంక్షలు
ఈ పండగ నేపథ్యంలో గురువారం గవర్నర్ రఘుబర్ దాస్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ మాఝి, కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జోయల్ ఓరం, అశ్వినీ వైష్ణవ్, మాజీ సీఎం నవీన్లతోపాటు రాష్ట్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.