KCR Paid Tributes To Saichand : సాయిచంద్ పార్థివ దేహం వద్ద కేసీఆర్ భావోద్వేగం..
KCR Paid Tributes To Mortal Remains Of Saichand : తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ పార్థివ దేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. హైదరాబాద్ శివారులోని గుర్రంగూడలో సాయిచంద్ నివాసానికి వెళ్లిన సీఎం.. శోకసంద్రంలో ఉన్న కుటుంబసభ్యులను ఓదార్చుతూ భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ ఎదుట సాయిచంద్ భార్య, తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. వారికి ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు.
కేసీఆర్తో పాటు మంత్రులు హరీశ్రావు, సబిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు , బీఆర్ఎస్తో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు, ప్రజాసంఘాల నాయకులు సాయిచంద్కు నివాళులర్పించారు. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన సాయిచంద్కు నిన్న రాత్రి గుండెపోటు వచ్చింది. నాగర్కర్నూల్లోని ఓ ఆస్పత్రికి తరలించి.. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.
మృతి విషయం తెలిసిన వెంటనే మంత్రి హరీశ్రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్తో పాటు పార్టీ నేతలు పెద్దఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. సాయిచంద్ మృతిపట్ల గవర్నర్ తమిళిసై సంతాపం తెలిపారు. మృతదేహాన్ని హైదరాబాద్ శివారులోని గుర్రంగూడలోని నివాసానికి తరలించారు. వనస్థలిపురం సాహెబ్నగర్ శ్మశాన వాటికలో సాయిచంద్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.