Dead Body Transportation on Two Wheeler in AOB: అమానుషం.. అంబులెన్స్ లేక 35 కిలోమీటర్లు ద్విచక్రవాహనంపై మృతదేహం
Published : Aug 25, 2023, 4:39 PM IST
35 Kilometers Dead Body Transportation on Two Wheeler in AOB: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రామాల్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ అందుబాటులో లేకపోవటంతో శవపంచనామా చేసిన మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై ఇంటికి తరలించిన ఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది. స్థానిక ప్రజలను కంటతడి పెట్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం ఎగువ గంజాయి భద్ర గ్రామానికి (కొటియా గ్రామాల్లో ఒకటి) చెందిన గమ్మిలి విశ్వనాధ్ (25) క్యాస్ట్ సర్టిఫికెట్ అవరసమైంది. క్యాస్ట్ సర్టిఫికెట్ నిమిత్తం ఒడిశా రాష్ట్రం పొట్టంగి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పని ముగించుకుని తిరిగి తన స్వగ్రామానికి ప్రయాణం అయ్యారు. అక్కడి నుంచి వస్తున్న క్రమంలో ఒడిశా రాష్ట్రం కుందిలి గ్రామం వద్ద వ్యాన్ ఢీకొని మృతి చెందారు. అనంతరం అదే రాష్ట్రంలో పొట్టంగి ప్రభుత్వ హాస్పిటల్లో మృతదేహానికి శవపంచనామా నిర్వహించారు. అక్కడ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో మృతుని బంధువులు మృతదేహాన్ని 35 కిలోమీటర్లు ద్విచక్రవాహనంపై (35 KiloMeters Dead Body on Scooter) స్వగ్రామానికి తరలించారు. ఈ దుర్ఘటన స్థానికులను కలిచి వేసింది. మృతుని తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు.