దేశ వ్యాప్తంగా కరోనా విధ్వంసం సృష్టిస్తుంటే.. కరోనా నుంచి కోలుకున్న వారు మరో ప్రమాదానికి గురవుతున్నారు. అదే నల్ల శిలీంధ్రం. వేగంగా వ్యాప్తి చెందుతూ చికిత్స ఆలస్యమైతే ప్రాణాంతకంగా మారుతోంది.
బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటి?
వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వారిలోకి బ్లాక్ ఫంగస్ చొరబడి ప్రాణాలు హరిస్తుంది. మ్యూకోర్ మైకోసిస్ రక్తంలో చెక్కెర నిల్వలు అధికంగా ఉంటే మరింత ప్రమాదకరంగా మారుతోంది. స్టెరాయిడ్స్ వాడిన వాళ్లలో ఈ ప్రమాదం ఎక్కువ. మధుమేహం ఉన్న వారు కోవిడ్ చికిత్సలో స్టెరాయిడ్స్ వాడితే బ్లాక్ ఫంగస్ సులభంగా వ్యాపిస్తుంది. సత్వరం దీనిని నిర్ధరణ చేస్తేనే చికిత్సించగలం. మ్యూకోర్ మైకోసిస్ ను మ్యూకోసైటిస్ అనే శిలీంధ్రం కలుగచేస్తుంది. ఇది అంతటా విస్తరించి ఉంటుంది. రోగ నిరోధక శక్తి తగ్గిన వారిలో దీని సిద్ధ బీజాలు ఊపిరితిత్తుల్లోకి చేరి శోథను కలుగచేస్తాయి. చర్మంపై గాట్లు ఉన్నా చర్మంలోకి చొరబడతాయి.
ఐసీఎంఆర్ సూచనల మేరకు ఈ కింది వారిలో బ్లాక్ ఫంగస్ ప్రమాదం ఉంటుంది.
- అదుపులో లేని మధుమేహం
- స్టెరాయిడ్స్ అధిక వాడకం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గటం
- దీర్ఘకాలం ఆసుపత్రిలో ఉండటం
- క్యాన్సర్, అవయువ మార్పిడి ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారు
- ఒరికొనజోల్ చికిత్స తీసుకున్న వారు