వైరస్ల నుంచి రక్షణ కోసం మానవుల్లో ఉన్న ఓ వ్యవస్థ పరోక్షంగా కరోనా సంక్రమణకు దోహదపడుతున్న తీరును శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. మానవ కణాల్లోకి ప్రవేశించేందుకు 'ఏసీఈ2' అనే రిసెప్టార్ను కరోనా వైరస్ ఉపయోగించుకుంటుంది. 'టీఎంపీఆర్ఎస్ఎస్2' అనే ఎంజైమ్ ఈ ప్రక్రియలో దోహదపడుతుంది.
సాధారణంగా మన శరీరంలోకి వైరస్ల రాకను ఇంటర్ఫెరాన్లు గుర్తించి, రోగ నిరోధక వ్యవస్థను అప్రమత్తం చేస్తాయి. వైరస్లకు వ్యతిరేకంగా ఇది కీలక రక్షణ వ్యవస్థ. అయితే- ఈ వ్యవస్థను కరోనా తనకు అనుకూలంగా మల్చుకుంటోంది.
ఇంటర్ఫెరాన్లు అప్రమత్తం చేయడంతో 'ఏసీఈ2' జన్యువు క్రియాశీలమై సంబంధిత రిసెప్టార్లను అధిక సంఖ్యలో విడుదల చేస్తుంది. వాటిని లక్ష్యంగా చేసుకుని కరోనా మానవ కణాల్లోకి చొరబడుతోంది. ఇతర వైరస్ల విషయంలో 'ఏసీఈ2' క్రియాశీలమవడం లాభదాయకమే. ఊపిరితిత్తులు దెబ్బతినకుండా అది రక్షణ కల్పిస్తుంటుంది. కరోనా విషయంలో మాత్రం ఈ పరిస్థితి ప్రతికూలంగా మారుతోంది. అయితే- 10% కంటే తక్కువ మానవ కణాల్లో మాత్రమే ఏసీఈ2, టీఎంపీఆర్ఎస్ఎస్2 ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇదీ చూడండి:అమెరికాకు వలసలు బంద్.. ఉత్తర్వులపై ట్రంప్ సంతకం