యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో.. లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన యధేచ్ఛగా జరుగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన నియమాల అమలును అధికారులు బేఖాతరు చేస్తున్నారు. ఈ కార్యాలయానికి తెలంగాణతోపాటు ఇతర ప్రాంతాల వారు కూడ సేవలు వినియోగించుకునేందుకు వస్తుంటారు.
కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్ధీగా కనిపిస్తున్నారు. ప్రధాన ద్వారం వద్ద శానిటైజర్ కనిపించడం లేదు. మాస్కులు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా నిబంధనలు విస్మరిస్తున్నారు. కార్యాలయంలో పనిచేసే సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం పట్ల విమర్శలు వస్తున్నాయి. యాదాద్రి జిల్లాలో ఇప్పటికే కరోనా విజృంభిస్తోంది. అయినప్పటికీ జాగ్రత్తలు పాటించకపోవటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. కార్యాలయాల్లో పనిచేసేవారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొంది. వైద్యఆరోగ్యశాఖ సూచనల మేరకు కార్యాలయాల్లో చేయాల్సిన, చేయకూడని పనుల జాబితాను విడుదల చేసింది.