Woman Dies Of Snake Bite In Warangal : వరంగల్ జిల్లా మహేశ్వరం గ్రామానికి చెందిన బండి మానస, సురేశ్లకు ఒక కుమారుడు ఒక కుమార్తె. భర్త సురేశ్ మద్యానికి బానిసై అనారోగ్యంతో ఎనిమిది సంవత్సరాల క్రితం మృతి చెందాడు. భర్త మరణం తర్వాత తల్లిదండ్రుల వద్దకు వచ్చిన మానస తండ్రి కూడా మరణించాడు. నర్సంపేట తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ ఆయన మరణించడంతో ఆ ఉద్యోగం మానసకు వచ్చింది.
అప్పటి నుంచి ఆ ఉద్యోగం చేస్తూ తన తల్లిని.. ఇద్దరి పిల్లల్ని తానే చూసుకుంటోంది మానస. ఓవైపు భర్త మరణం.. మరోవైపు తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మానస.. చివరకు వాటన్నింటిని తట్టుకుని నిలబడ్డ సమయంలో పాము కాటు ఆ కుటుంబాన్ని మళ్లీ అగాథంలోకి తోసేసింది. 15 రోజుల క్రితం రాత్రి పూట నిద్రిస్తున్న సమయంలో మానసను విషసర్పం కాటేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న మానస మంగళవారం అర్ధరాత్రి 11 గంటలకు మృతి చెందింది. అన్ని తానై పోషిస్తున్న తల్లి మరణించడంతో ఆ చిన్నారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మందుకొట్టి పాముతో ఆట.. కాటేయగానే 'మృతి'.. అంత్యక్రియల వేళ లేచి కూర్చుని..
"మానస పాము కాటుకు గురై గత 15 రోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు వాళ్లకు ఎలాంటి ఆస్తులు లేవు. ఆమె భర్త ఎనిమిది సంవత్సరాల క్రితం మరణించాడు. పిల్లలకు ఉండడానికి ఇల్లు తప్ప మరేం లేదు. ఇప్పుడు తల్లి కూడా మరణించడంతో ఆ పిల్లలు అనాథలయ్యారు. మానస తల్లికి వయసైపోయింది. ఇప్పుడు ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ పసివాళ్లపైనే ఉంది. ఆ పసిపిల్లలకు ప్రభుత్వం అండగా నిలవాలి." - స్వామి, సమీప బంధువు