తాండూరులో మిషన్ భగీరథ పైపుల కోసం సీసీరోడ్లను తవ్వేస్తున్నారు. రోడ్లపైనే వ్యర్థాలు వదిలేయడం వల్ల వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని తరలించటానికి గుత్తేదారు చర్యలు చేపట్టారు. జేసీబీతో ట్రాక్టర్లల్లో నింపి పట్టణంలోని ఆదర్శనగర్లోని కేంద్ర ఉద్యాన స్థలంలో పారబోస్తున్నారు. దీంతో రహదారులు అధ్వాన స్థితికి రావడంతో పాటు మున్ముందు ఉద్యానం అభివృద్ధికి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు.
నాటి హామీ ప్రకారం..
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ 2018లో తాండూరు పర్యటనకు వచ్చిన సందర్భంలో రోడ్ల అభివృద్ధికి రూ.25కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ నిధులతో పాటు ఆర్అండ్బీ నుంచి మరో రూ.7 కోట్లు మంజూరు చేశారు. దీంతో పట్టణంలోని ప్రధాన రోడ్లను సిమెంటు రహదారులుగా అభివృద్ధి చేశారు. దీంతో అంతా సంతోషించారు. అంతలోనే మిషన్ భగీరథ పైపులు ఏర్పాటు చేయటానికి గుత్తేదారు రోడ్లను తవ్వేస్తున్నారు. దీంతో స్థానికులు రూ.కోట్ల నిధులు వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యానం అభివృద్ధికి నిధులు
కేంద్ర ఉద్యానం అభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. సాంకేతిక, పరిపాలనా పరమైన అనుమతులు రావాల్సి ఉంది. ఆ ప్రక్రియ పూర్తి కాగానే అభివృద్ధి పనులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు పోస్తున్న వ్యర్థాలను మళ్లీ తరలించాల్సి రావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రహదారి వ్యర్థాలను ఇక్కడ కాకుండా మరోచోట వేస్తే మంచిదని పేర్కొంటున్నారు.