విద్యార్థులు చేరక, ఉపాధ్యాయులు లేక, సౌకర్యాలు కరవై, ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టక... ఇలా అనేక కారణాలతో ప్రభుత్వ పాఠశాలలు మూసివేతకు గురవుతున్నాయి. ఇందులో పిల్లలు చేరకపోవడం ప్రధాన కారణంగా మారింది. ఈ పరిస్థితుల్లో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపు పాఠశాల ముందు నో-అడ్మిషన్ బోర్డు వెలసింది. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధిస్తున్న ఈ పాఠశాలలో ఇప్పటికే 500 మంది విద్యార్థులున్నారు. అయినప్పటికీ మరింత మంది విద్యార్థులు చేరేందుకు వస్తున్నారు. కానీ సరిపడా సిబ్బంది, తరగతి గతులు లేక నో-అడ్మిషన్ బోర్డులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రధానోపాధ్యాయుడు యతిపతిరావు తెలిపారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్యాంపులో పనిచేసే ఆఫీసర్ల పిల్లల కోసం 1968లో ఈ బడిని ప్రారంభించారు. అనంతరం ప్రాథమికోన్నత పాఠశాలగా మార్చి కొన్నేళ్లు నడిపారు. 1986లో ప్రైమరీ స్కూల్గా మార్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నత వర్గాల నుంచి సాధారణ స్థాయి వరకు అందరి పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. 2000 సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం కోసం చాలామంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారు. దాదాపు 500కు పైగా ఉన్న విద్యార్థుల సంఖ్య 144కు చేరుకుంది.