సూర్యాపేట జిల్లాలో కరోనా కలవరం రేపుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం వల్ల జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలకు భరోసా కల్పించేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి... రెడ్ జోన్ ప్రాంతాల్లో పర్యటించి లాక్డౌన్ సందర్బంగా చేపడుతున్న చర్యలు వివరించి సహకరించాలని ప్రజలను కోరారు. సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇవాళ 15 కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా నేటికి మొత్తం కేసులు 55 అయ్యాయి. అప్రమత్తమైన మంత్రి జగదీష్ రెడ్డి రంగంలోకి దిగారు. ప్రజల భయపడకుండా స్వయంగా రెడ్ జోన్ ప్రాంతాల్లో పర్యటించి కరోనా నివారణకు చేపడుతున్న చర్యలు ప్రజలకు వివరించారు.
జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్తో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షించారు. కొత్తగా నమోదైన కేసులన్నీ ప్రైమరీ కాంటాక్టుల ద్వారా సంక్రమించినవేనని, కేసుల తీవ్రత పెరిగే అవకాశాన్ని ముందే ఊహించి లోతుగా విచారించినట్టు తెలిపారు. అనుమానిత ప్రాంతాల్లో హెల్త్ సర్వే చేపట్టి కరోనా సోకిన వ్యక్తుల ప్రైమరీ కాంటాక్టులను క్వారంటైన్ చేసి, ఎలాంటి ఉపద్రవం వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు.