సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన బాబు-మమత దంపతుల కుమారుడు చంటి. గత నెల 23న ఎనిమిదేళ్ల చంటి స్నేహితులతో ఆడుకుంటూ ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కి... విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని తొలుత కోదాడ తర్వాత ఖమ్మం ఆస్పత్రికి తరలించినా పట్టించకోకపోవటంతో వరంగల్కు తీసుకెళ్లారు.
చెత్తకుప్ప పోయడం వల్లే ప్రమాదం
ప్రమాదంలో ఎడమ చేయి పూర్తిగా దెబ్బతినటంతో వైద్యులు భుజం వరకు తొలగించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు హఠాత్తుగా మంచం మీద పడటంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటివరకు చికిత్స కోసం ఐదు లక్షల వరకు ఖర్చు చేశారు. ఇక వైద్యం చేయించే స్తోమత తమకు లేదని... దాతలు ముందుకు వచ్చి సాయం అందించాలని వేడుకుంటున్నారు. తోటి పిల్లలు ఆడుకుంటుంటే... తాను మాత్రం ఇంట్లో ఉండడం బాధగా ఉందని చంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ట్రాన్స్ఫార్మర్ వద్ద చెత్తకుప్ప పోయడం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చెత్తకుప్పను తొలగించాలని చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా విద్యుత్ అధికారులు కన్నెత్తి చూడటం లేదని తెలిపారు. తమ కుటుంబానికి ఆస్తులేమీ లేవని.... తమ ఆర్థిక పరిస్థితిని చూసి... ఆపన్న హస్తం అందించాలని కోరుతున్నారు.