తెలంగాణ

telangana

By

Published : Aug 9, 2021, 8:27 PM IST

ETV Bharat / state

'ఆ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం, రెండు పడకగదులు ఇల్లు ఇస్తాం'

హైదరాబాద్‌లోని సాహెబ్‌నగర్‌లో గల్లంతై... మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి (MLA SUDHEER REDDY) హామీ ఇచ్చారు. వారికి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం, రెండు పడక గదుల ఇల్లు ఇస్తామని ప్రకటించారు. న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళన చేపట్టగా... ఎమ్మెల్యే వారితో మాట్లాడారు.

MLA SUDHEER REDDY, vanasthalipuram sanitary workers death
పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటాం, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ

హైదరాబాద్ నగరంలోని సాహెబ్‌నగర్‌లో గల్లంతై... మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వపరంగా అండగా ఉంటామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి(MLA SUDHEER REDDY) హామీ ఇచ్చారు. మృతులు అంతయ్య, శివ కుటుంబసభ్యులకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగంతోపాటు డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు, పింఛన్ సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. అంతయ్య మృతదేహం లభించిన సామా నగర్ వద్ద న్యాయం చేయాలంటూ రోడ్డుపై మృతుల కుటుంబసభ్యులు బైఠాయించారు.

ఎమ్మెల్యే హామీ

బాధిత కుటుంబసభ్యులతో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఎమ్మెల్యే హామీలతో వారు ఆందోళన విరమించారు. అనంతరం అంతయ్య మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

మృతదేహం లభ్యం

హైదరాబాద్‌ నగరంలోని సాహెబ్‌నగర్‌లో గల్లంతైన పారిశుద్ధ్య కార్మికుడు అంతయ్య మృతదేహం లభ్యమైంది. డ్రైనేజీ పూడిక తీసేందుకు గత మంగళవారం రాత్రి శివ, అంతయ్య మ్యాన్‌హోల్‌లోకి దిగి గల్లంతైన విషయం తెలిసిందే. ఘటన జరిగిన ప్రాంతానికి 200 మీటర్ల దూరంలో 800ఎంఎం సివర్‌ ట్రంక్ పైపు లైన్‌లో అంతయ్య మృతదేహాన్ని గుర్తించారు. డ్రైనేజీలో పడిన ఇద్దరిలో శివ మృతదేహం ఇప్పటికే లభ్యమైంది.

కేసు నమోదు

హైదరాబాద్​ శివారులోని వనస్థలిపురం సాహెబ్​నగర్​లో డ్రైనేజీ ఘటనలో ఇద్దరు మృతికి కారణమైన కాంట్రాక్టర్​పై కేసు నమోదు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ ఇప్పటికే​ వెల్లడించారు. ఈ ప్రమాదానికి గుత్తేదారుని నిర్లక్ష్యమే కారణమని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాత్రి సమయంలో డ్రైనేజీ శుభ్రం చేసేందుకు అనుమతి లేనప్పటికీ.. కాంట్రాక్టర్​ ఒత్తిడితోనే శివ, అంతయ్యలు మురికి కాలువలోకి దిగి మృత్యువాతపడ్డారని సీపీ పేర్కొన్నారు. ఈ ఘటనలో గుత్తేదారునిపై వనస్థలిపురం పోలీస్​ స్టేషన్​లో మ్యాన్​హోల్​ సివరేజ్​ చట్టం కింద కేసు నమోదుచేసినట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details