రాష్ట్ర వ్యాప్తంగా 267 మంది కరోనా కోరల్లో చిక్కి మృతి చెందారు. వీరిలో 80 శాతానికి పైగా గ్రేటర్ పరిధిలోని వారే. నిబంధనల ప్రకారం వీరికి ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహించాలి. కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు కడసారి చూపునకు మాత్రమే అనుమతి ఉంటుంది. అది కూడా.. దూరంగా ఉండి చూడాలి.
భౌతికకాయాన్ని ఆసుపత్రి నుంచి శ్మశానానికి తరలించడం, అంతిమ సంస్కారం సర్కారు పని. నగరంలో జీహెచ్ఎంసీ ఆ బాధ్యత నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలో బల్దియా సిబ్బంది ఇటీవలి వరకు విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నారు. మృతదేహాలను తీసుకొని శ్మశానవాటికల కోసం చక్కర్లు కొట్టారు. స్థానికులు అంత్యక్రియలకు అనుమతించకపోవడమే అందుకు కారణం.