మానేరుపై తాగు, సాగు నీటికి 'చెక్'డ్యాం మానేరు నదికి వరదలు తగ్గిపోవటం వల్ల ఏళ్ల తరబడి నదిలో ప్రవాహం కొనసాగక గ్రామాల్లో భూగర్భజలాలు పడిపోతున్నాయి. గోదావరి జలాలను నిరంతరం మధ్య, దిగువ మానేరు జలాశయాలకు తరలించేందుకు వీలుగా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సిద్ధం చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మధ్యమానేరు, దిగువ మానేరుకు నీటి సమస్య ఉండదని ప్రభుత్వం అంచనా వేసింది. చెక్ డ్యాంల నిర్మాణాలు.. వాటి అనుకూలతలు.. నీటినిల్వ సామర్థ్య వ్యయంపై నేడు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశం కానున్నారు.
ఐదారు కిలోమీటర్లకు ఓ చెక్ డ్యాం
మధ్య మానేరుకు 50 టీఎంసీలు, దిగువ మానేరు 43 టీఎంసీల ప్రవాహం ఈ ఏడాది వచ్చింది. మధ్య మానేరు నుంచి దిగువకు వెళ్లే నీటిలో సాధ్యమైనంత వరకు నీటిని మధ్యలోనే నిల్వ చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి ఐదారు కిలోమీటర్లకు ఒక చెక్ డ్యాం నిర్మించాలనే అంచనాకు వచ్చారు. ఒక్కో చెక్ డ్యాంకు రూ.5కోట్లకు పైగానే వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నది వెడల్పుగా విస్తరించిన చోట ఈ డ్యాములు నిర్మిస్తే... నీటి నిల్వతో పాటు ముంపు ప్రాంతాలు కూడా ఉండవనే ఆలోచనలో ఇంజినీర్లు ఉన్నారు. చెక్ డ్యాంలు నిర్మించేందుకు అనువైన దిగువ, ఎగువ మానేరు ప్రాంతాలపై అధికారులు దృష్టిసారిస్తున్నారు.
ఇవీ చూడండి: ఇక అన్ని రకాల రైల్వే సేవలకు ఒకటే నంబర్