తెలంగాణ

telangana

SRSP: ప్రాజెక్టుకు భారీ ప్రవాహం... అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

By

Published : Jul 22, 2021, 10:55 PM IST

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండిపోయాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు భారీ ప్రవాహం వస్తుండగా.. గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.

SRSP
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు

శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. రెండు రోజుల్లోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరింది. ఈనెల 20న 12వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంటే.. ప్రాజెక్టులో 71టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. రెండు రోజుల్లోనే పూర్తిగా నిండిపోయింది. 21న రాత్రికి 29వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంటే.. 74 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 21న అర్ధరాత్రి నుంచి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒకేసారి 59వేల క్యూసెక్కుల ప్రవాహం రాగా.. గురువారం ఉదయం ఆరు గంటలకల్లా 70వేలు దాటింది. నీటి నిల్వ 78 టీఎంసీలకు చేరుకుంది. ఉదయం పది గంటలకు లక్షన్నర క్యూసెక్కుల ప్రవాహం రాగా.. నీటి నిల్వ 80 టీఎంసీలకు చేరింది. ఉదయం 11గంటలకు 2.8లక్షల క్యూసెక్కుల భారీ ప్రవాహం ప్రాజెక్టులో చేరింది. మధ్యాహ్నం 12గంటలకు ఏకంగా 4.32క్యూసెక్కుల ప్రవాహం ప్రాజెక్టులోకి పోటెత్తింది.

వరుసగా గేట్లు ఎత్తివేత..

భారీ ప్రవాహం ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఎనిమిది గేట్లు ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. విద్యుదుత్పత్తి చేస్తూ... 8 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. మధ్యాహ్నం 2గంటలకు ప్రవాహం 4లక్షల క్యూసెక్కులకు చేరుకోగా.. 16గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. మధ్యాహ్నం 3గంటలకు 32గేట్లు ఎత్తగా.. 2లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రాజెక్టు నుంచి రెండున్నర క్యూసెక్కులు వదిలారు. ఐదు గంటలకు మూడు లక్షల ఇన్ ఫ్లో ఉంటే.. నాలుగు లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. సాయంత్రం ఏడు గంటలకు 35 గేట్లు ఎత్తి నది పూర్తి సామర్థ్యం 6 లక్షల క్యూసెక్కులను గోదావరిలోకి వదిలారు. రాత్రి ఎనిమిది గంటలకు అవుట్ ఫ్లో నాలుగున్నర లక్షలకు తగ్గించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రాజెక్టును మంత్రి ప్రశాంత్​ రెడ్డి సందర్శించారు. అక్కడ పరిస్థితులపై కలెక్టర్​, ఇతర అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఎస్‌ఆర్‌ఎస్పీకి వరద, నీటి విడుదలపై చర్చించారు. అనంతరం లోతట్టు గ్రామాల సర్పంచ్‌లతో ఫోన్‌లో మాట్లాడి... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంతోషంలో రైతన్నలు..

మూడు నాలుగేళ్లుగా ఎస్​ఆర్​ఎస్పీకి వరుసగా నిండుతుండటం రైతులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ ఏడాది సైతం జలాశయం నిండడంతో.. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగిస్తున్నారు. వరి నాట్లు వేస్తున్నారు. గతంలో ప్రాజెక్టు లీకేజీ నీళ్ల కోసం సైతం రైతులు ఉద్యమాలు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాళేశ్వరం వల్ల వరద కాలువలో నిత్యం నీళ్లు ఉంటున్నాయి. అలాగే భూగర్భ జలాలు సైతం పెరిగాయి. ప్రస్తుతం కాలువల నీళ్లు అందించకుండానే.. వర్షాలకే ఆయకట్టు రైతులు పనులు చేసుకునే పరిస్థితి ఉంది. శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు వరద కాలువ ద్వారా పూర్వవైభవం తెచ్చేందుకు చేపట్టిన పునరుజ్జీవనం ప్రాజెక్టు అవసరం ఇప్పటి వరకు రాలేదు. సాగుకు సరిపడా నీళ్లు అందుబాటులో ఉండటం పట్ల.. రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి:NIZAMABAD RAINS: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను ముంచెత్తిన వాన.. పొంగిపొర్లుతున్న వాగులు

ABOUT THE AUTHOR

...view details