తెలంగాణ

telangana

ETV Bharat / state

పగ రగిలింది.. ఈ యేడు పాత కక్షల హత్యలే ఎక్కువ!

వచ్చే ఏడాది జిల్లాలో క్రైం రేట్ తగ్గేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని నిజామాబాద్‌ ఎస్పీ శ్వేతారెడ్డి పేర్కొన్నారు. 2020వ సంవత్సరానికి సంబంధించి జిల్లాలో జరిగిన నేరాల పట్టికను విడుదల చేశారు. అవినీతికి పాల్పడిన పోలీసు సిబ్బందిపై సైతం కఠిన చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు.

By

Published : Dec 30, 2020, 11:43 AM IST

crime-rate-in-nizamabad-in-the-year-2020
నిజామాబాద్‌లో ఈ యేడు పాత కక్షల హత్యలే ఎక్కువ!

నిజామాబాద్‌లో 2020వ సంవత్సరానికి సంబంధించి.. జరిగిన క్రైం రేట్‌పై జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఆస్తి తగాదాలు, పాత కక్షలతో కూడిన హత్యలు ఎక్కువగా జరిగాయని పేర్కొన్నారు.

లాక్‌డౌన్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ పోలీసుశాఖ నిరంతరం శ్రమించిందని ఎస్పీ గుర్తుచేశారు. జిల్లాలో 250 మందికి పైగా తమ సిబ్బంది కొవిడ్‌ బారిన పడ్డారని పేర్కొన్నారు. అయినప్పటికీ శాంతిభద్రతల పర్యవేక్షణలో ఎక్కడ లోటు రాకుండా జాగ్రత్తలు వహించామని గుర్తుచేశారు. పోలీసుశాఖలో అవినీతికి పాల్పడిన 45 మంది అధికారులపై సైతం చర్యలు తీసుకున్నామన్నారు. ఉత్తమ సేవలు అందించిన వారికి రివార్డులెలా ఇస్తామో.. తప్పు చేస్తే, శిక్షలు కూడా అదేవిధంగా ఉంటాయని స్పష్టం చేశారు.

జిల్లాలో 2020వ సంవత్సరానికి జరిగిన పూర్తి నేరాల వివారాలను ఎస్పీ శ్వేతారెడ్డి ఈ విధంగా వివరించారు.

  • 28 హత్య కేసుల్లో 16 కేసులు కుటుంబసభ్యుల మధ్య జరిగినవి.
  • ఇళ్లలో 207 చోరీలు జరిగాయి. 50 శాతానికి పైగా నేరస్థులను గుర్తించాం. 203 కేసుల్లో 153 మందిని అరెస్ట్ చేశాం. 29 మందికి ఇప్పటికే శిక్ష ఖరారైంది.
  • 4 చైన్ స్నాచింగ్ కేసులు నమోదవగా.. రెండు కేసులను, ఘటన జరిగిన రోజే సీసీ కెమెరాల ద్వారా ఛేదించాం. ముగ్గురిని అరెస్ట్‌ చేశాం.
  • 12 అత్యాచార కేసుల్లో ఎక్కువ శాతం 25-30 సంవత్సరాలున్న మహిళలపై జరిగాయి.
  • 201 ప్రమాదాల్లో.. 126 సొంత తప్పిదాల వల్లే జరిగాయి.
  • 173 మంది సాధారణ కారణాలతో చనిపోగా.. 323 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆరోగ్య సమస్యలతో 23, ఆర్థిక సమస్యలతో 60, కుటుంబ కలహాలతో 122, ప్రేమ విఫలమై 98, ఇతర కారణాలతో మరో 20 మంది చనిపోయారు.
  • హెల్మెట్ ధరించని లక్షా 20 వేల 233 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశాం.

సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రజలు వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలి. కొత్త స్కీంల పేరుతో వచ్చే వారిని నమ్మొద్దు. వచ్చే నెల నుంచి సైబర్ నేరాలపై.. ఆన్లైన్ ద్వారా జిల్లా ప్రజలకు అవగాహన కల్పిస్తాం. జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటులో తాడ్వాయి మండలం ముందంజలో ఉంది. మొత్తం 18 గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటై ఉన్నాయి. ఈ మండలాన్ని మిగతా మండలాలు ఆదర్శంగా తీసుకోవాలి. వచ్చే ఏడాది జిల్లాలో క్రైం రేట్ తగ్గేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం.

- జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి.

ఇదీ చదవండి:నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది: సీపీ

ABOUT THE AUTHOR

...view details