తెలంగాణ

telangana

By

Published : Apr 30, 2021, 4:02 PM IST

ETV Bharat / state

రాబంధుల్లా అంబులెన్స్ డ్రైవర్లు.. ఆందోళనలో కరోనా మృతుల కుటుంబాలు

కరోనా సోకి వైద్యం కోసం డబ్బులు లేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల బాధలు అన్నీ ఇన్నీ కావు. మార్చురీ నుంచి శ్మశానవాటిక వరకు పైసాతోనే పని.. లేదంటే జరగని అంతిమ సంస్కరణలు.. వ్యక్తి చనిపోగానే వాలిపోయి.. అంబులెన్స్‌ డ్రైవర్లు బేరాలకు దిగుతున్నారు. కిలోమీటరుకు రూ.వెయ్యి.. కాదంటే శవం ఆస్పత్రి దాటదంటూ మృతుల బంధువులను రాబంధుల్లా పీక్కుతింటున్నారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 'ఫిక్స్‌డ్‌'గానే ఆంబులెన్స్ డ్రైవర్ల దందా సిండికేట్ అవుతోంది.

Nizamabad District News, Corona Deaths in Nizamabad District, Ambulance Drivers in Nizamabad
నిజామాబాద్ జిల్లా వార్తలు, నిజామాబాద్​ జిల్లాలో కరోనా మరణాలు, నిజామాబాద్​లో అంబులెన్స్ డ్రైవర్ల దందా

కరోనా సోకిన వారికి వైద్యం దొరకకపోవడం ఓ సమస్య అయితే.. వైరస్ సోకి మృతి చెందిన వారి మృతదేహాన్ని వైకుంఠధామలకు తీసుకువెళ్లడం ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. ఆస్పత్రి బయట అంబులెన్స్‌ డ్రైవర్లు ఎంత చెబితే అంత కట్టి బయటపడాల్సిందే. మనిషి పోయిన బాధని మించిన కుంగుబాటుకు గురైన బంధువులు, అంబులెన్స్‌ డ్రైవరు చేతిలో అడిగినంతపెడుతున్నారు. నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఈ వ్యవహారం సర్వసాధారణంగా మారిపోయింది. జనరల్ ఆసుపత్రిలో కేవలం ఒక్క పార్థివదేహ వాహనం ఉండటం వల్ల ప్రైవేట్ అంబులెన్స్‌ డ్రైవర్లకు కరోనా కాలంలో ఇది వరంలా మారింది. అంబులెన్స్ నిర్వాహకులు సిండికేట్ అయి సామాన్యుడిని పీక్కు తింటున్నారు.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి రోజు కొవిడ్​తో అనధికారికంగా పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. అంబులెన్స్‌కు ఎక్కడైనా కిలో మీటర్​కు రూ.10 నుంచి రూ.12 వరకు వసూలు చేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం దూరంతో సంబంధం లేకుండా.. దండుకొంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంబులెన్స్‌ కోసం బంధువులు సంప్రదించగా డ్రైవర్​లు కరోనా ప్యాకేజీలు చెబుతున్నారు. కరోనా శవాలకు ప్రత్యేక ప్యాకేజీలు.. ఆస్పత్రి నుంచి శ్మశానం వరకు సుమారు 30 వేల రూపాయల వరకు దోచేస్తున్నారు.

శవాన్ని వైకుంఠధామానికి తరలించడం కోసం దూరాన్ని బట్టి 8 వేల నుంచి 15 వేలకు పైగా అంబులెన్స్ డ్రైవర్లు వసూలు చేస్తున్నారు. వైద్యం అందించడమే కాదు కొవిడ్ మృతదేహానికి అంతిమ సంస్కరణలు అందేవరకు ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందని మృతుల బంధువులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details