దయనీయ స్థితిలో దేవరకొండ ప్రభుత్వాసుపత్రి నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ దవాఖానాను... 2013లో వంద పడకలకు విస్తరిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పేరుకే వంద పడకలు కానీ... 50 పడకలు కూడా సరిగా లేని దుస్థితి. నిత్యం వెయ్యికి పైగా ఓపీతోపాటు 250 వరకు ఇన్ పేషెంట్ల సంఖ్య ఉంటోంది. 25 మంది వైద్యులకుగాను 23 మంది విధుల్లో ఉంటున్నా... వాళ్లు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని అయోమయ పరిస్థితి ఉందని రోగులు చెబుతున్నారు.
వసతులు లేక...
మందులు, సూదుల కోసం... గంటల కొద్దీ వేచి చూడాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రసవాల సమయంలో అవసరమయ్యే అల్ట్రా స్కానింగ్ పరికరాలు లేకపోవడంతో... ప్రైవేటు ఆసుపత్రుల్ని ఆశ్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు.
అందుబాటులో లేని వైద్య పరీక్షలు
పెద్దాసుపత్రికి వచ్చే రోగులకు మందులు అవసరం కాగా అందులో కొన్నిమాత్రమే దొరుకుతున్నాయి. మందుల కోసం ఏటా 25 లక్షలు కేటాయిస్తున్నా... అవి ఏ మూలకూ సరిపోవడం లేదు. వివిధ వైద్య పరికరాల కోసం రెండు మూడేళ్ల నుంచి ప్రతిపాదనలు పంపుతున్నా... అమలుకు నోచుకోవడం లేదు. పరికరాలు లేక వైద్య పరీక్షల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని రోగులు చెబుతున్నారు.
అప్పటి కలెక్టర్ ఆగ్రహం
గతంలో కలెక్టర్గా పనిచేసిన గౌరవ్ ఉప్పల్ ఈ ఆస్పత్రిని సందర్శించి సిబ్బందిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు సరిగా నిర్వర్తించని వైద్యుడిని సస్పెండ్ చేశారు. సమయానికి వైద్యులు రావడం లేదని రోగులు చెబుతుండగా... ఇతర సిబ్బంది లేకపోవడం వల్ల పూర్తిస్థాయిలో సేవలు అందించలేక పోతున్నామని వైద్యులు అంటున్నారు.
ఇదీ చూడండి: కశ్మీర్లో వరుసగా మూడో రోజూ బంద్