తెలంగాణ

telangana

By

Published : Oct 19, 2020, 7:03 PM IST

Updated : Oct 19, 2020, 7:15 PM IST

ETV Bharat / state

నీటమునిగిన ఇళ్లు..  ఆదుకోవాలని బాధితుల వేడుకోలు

హైదరాబాద్‌ను ప్రస్తుతానికి వాన వీడినా... వరద వెన్నాడుతోంది. నగర శివార్లలో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. కాలనీలు, ఇళ్లలో నీళ్లు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మీర్‌పేట్‌ పరిధిలో గొలుసుకట్టు చెరువులకు వరద ఉద్ధృతి పెరిగింది. కాలనీలు, రహదారులపై భారీగా వరద పోటెత్తడంతో... రాకపోకలకు అంతరాయం ఏర్పడి జనజీవనం స్తంభించిపోయింది. వాన ముప్పు ఇంకా తొలగకపోవడంతో.... ముంపు బాధితులు ఆందోళన చెందుతున్నారు.

meerpet-victims-want-the-support-them-to-telangana-government
నీటమునిగిన ఇళ్లు..  ఆదుకోవాలని బాధితుల వేడుకోలు

నీటమునిగిన ఇళ్లు.. ఆదుకోవాలని బాధితుల వేడుకోలు

హైదరాబాద్‌ శివారు మీర్‌పేట్‌ పరిధిలోని చెరువులకు వరద ఉద్ధృతి పెరిగింది. పెద్దచెరువు, మంత్రాల, సందె చెరువులు నిండుకుని అలుగులు పారుతుండడం వల్ల..పదుల సంఖ్యలో కాలనీలు జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. బలహీనంగా ఉన్న మీర్‌పేట్‌ చెరువు కట్ట తెగే ప్రమాదం ఉండడం వల్ల.. అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు లోతట్టు ప్రాంతాల ప్రజలను ట్రాక్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

సొంతింటిని వదిలి..

వరద తాకిడికి మిథిలానగర్‌ కాలనీ జలమయమైంది. మంత్రాలయం చెరువు నిండి దిగువకు భారీగా ప్రవాహం ఉండడం వల్ల కాలనీ నీటమునిగింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వరద ఉద్ధృతి ధాటికి ఓ ఇల్లు జలపాతాన్ని తలపిస్తోంది. వెనక భాగం నుంచి వస్తున్న నీళ్లు.. ఇంట్లో కెళ్లి బయటకు పొంగి పొర్లుతోంది. ఇంట్లో నడుములోతు నీళ్లు చేరడం వల్ల.. బియ్యం, సరకులు, సామగ్రి, పిల్లల పుస్తకాలు తడిసిపోయాయి. మరికొన్ని వస్తువులు బయటికి కొట్టుకుపోయాయి. ముంపు భయంతో సొంతింటిని వదిలి వెళ్లాల్సి వస్తోందంటూ బాధితులు కంటతడిపెడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

నీటమునిగిన ఇళ్లు

అటు ఎమ్​ఎల్​ఆర్​ కాలనీలోకి పెద్ద చెరువు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి మంత్రాల చెరువులోకి వరద ప్రవాహం కొనసాగుతుండడం వల్ల.. దిగువన ఉన్న ఇళ్లన్నీ నీటమునిగాయి. దీంతో కాలనీవాసులు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. బాధితులను కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు ఆదుకుంటున్నారు.
మీర్‌పేట తిరుమల ఎన్‌క్లేవ్‌లో వరద కష్టాలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాన ముప్పు ఇంకా తొలగకపోవడం వల్ల.. ఇళ్లు ఖాళీ చేసి బంధువుల ఇంటికి వెళ్లిపోతున్నారు. మరికొందరు సొంతూళ్లకు వెళుతున్నారు.

వరద ఉద్ధృతికి ఎస్​ఎల్​ఎన్​ఎస్​ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. మీర్‌పేట్‌ చెరువు నుంచి వస్తున్న ప్రవాహంతో... కాలనీలో నడుములోతు నీళ్లు చేరాయి. ఇళ్లు సగానికి మునిగిపోవడం వల్ల స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. రహదారులు చెరువులను తలపిస్తుండగా.. వాహనాలు అడుగు కూడా కదలడం లేదు.


ఇదీ చూడండి :ప్రతి ఇంటికి రూ.10 వేల ఆర్థిక సాయం: సీఎం

Last Updated : Oct 19, 2020, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details