కరోనా వైరస్ నియంత్రణలో అహర్నిశలు శ్రమిస్తున్న మహబూబ్నగర్ జిల్లా అధికార యంత్రాంగం.. లాక్డౌన్లో జనం ఇబ్బంది పడకుండా.. టెలీ విధానాలను అనుసరిస్తోంది. అందులో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమాండ్ కంట్రోల్ రూం, వైద్య సేవలు, మందుల కోసం టెలీమెడిసిన్ లాంటి కార్యక్రమాలను చేపట్టింది. ఫలితంగా కరోనా నియంత్రణలో విజయం దిశగా ప్రయాణిస్తోంది.
ఖర్చు వినియోగదారుడే భరించాలి
తాజాగా శనివారం నుంచి ఎం3 ఫ్రెష్ పేరుతో టెలీబుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. మహబూబ్నగర్ జిల్లా యంత్రాంగం, మెప్మా, ఎంసీఆర్హెచ్ఆర్డీఐ ఆధ్వర్యంలో ఈ సేవల్ని ప్రారంభించనున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల వరకూ 08542-252203 లేదా, 9553050607 నెంబర్లకు కాల్ చేస్తే.. ప్రజలకు కావాల్సిన పండ్లు, కూరగాయలు, మాస్కులు, శానిటైజర్లు నేరుగా ఇళ్ల వద్దకే డెలివరీ చేస్తారు. వాటికయ్యే ఖర్చు వినియోగదారుడే భరించాల్సి ఉంటుంది.
ధాన్యం కొనుగోళ్ల సమస్యలు
మార్కెట్ రేటుకే ఈ సరుకులు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఎలాంటి సాయం కావాలన్నా.. లేదా ఏవైనా ఫిర్యాదులు చేయాలన్నా.. 08542-241165 నెంబర్కు కాల్ చేయవచ్చు. ఇక రైతులు, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం మహబూబ్నగర్ వ్యవసాయశాఖ కార్యాలయంలో 7288894333, 7288894390, 7288897898. నెంబర్లతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.
ఆన్లైన్లో శిక్షణ
ఉద్యోగులు, సిబ్బందిని ఎప్పటికప్పుడు సమాయత్తం చేసేందుకు ఆధునిక సాంకేతికను మహబూబ్నగర్ జిల్లా యంత్రాంగం వినియోగించుకుంటోంది. జిల్లాలోని 18 ప్రాంతాల నుంచి సుమారు 3వేల మందికి కొవిడ్-19 మార్గదర్శకాలపై ఆన్లైన్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్యులు, అంగన్వాడీలు, ఆశ కార్యకర్తలు, మున్సిపల్, రెవిన్యూ, వైద్యారోగ్యశాఖ సహా ఇతరశాఖల సిబ్బంది ఈ శిక్షణలో పాల్గొన్నారు.