ఉమ్మడి పాలమూరులో కొవిడ్ వైరస్ విజృంభిస్తోంది. తాజాగా మహబూబ్నగర్లో రెండు కేసులు నిర్ధరణయ్యాయి. నాగర్కర్నూలు జిల్లా బల్మూర్ మండలంలో ఓ వ్యక్తి కరోనాతో మరణించగా... అతని అంత్యక్రియలు గ్రామంలోనే చేపట్టారు. అక్కడికి హాజరైన 14 మందిలో ఇద్దరికి వ్యాధి సోకినట్లు కలెక్టర్ ప్రకటించారు.
నారాయణపేట జిల్లా మద్దూరులో ఒకరు అనారోగ్యానికి గురై మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి వెళ్లారు. అనుమానంతో పరీక్షలు చేయగా రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. జోగులాంబ గద్వాల జిల్లా గొర్లఖాన్ దొడ్డికి చెందిన ఓ వ్యక్తి మృత్యువాతపడ్డారు.
ఒక్క వ్యక్తి వల్ల క్వరంటైన్లో 42 మంది
హైదరాబాద్ బోడుప్పల్లో నివాసముంటున్న వ్యక్తి కరోనా ఉందని తెలీక.. వనపర్తి జిల్లా బండరావిపాకుల, రేవల్లి మండల కేంద్రాల్లో భూపంచాయతీ విషయమై వచ్చి వెళ్లాడు. తర్వాత ఆయనకు వైరస్ ఉందని తెలిసి.. అతనికి ప్రైమరీ కాంటాక్టులైన 30 మందిని హోం క్వారంటైన్కు తరలించారు. అదే వ్యక్తి నాగర్కర్నూలు జిల్లా సింగోటంలో వేడుకకు హాజరుకాగా.. అక్కడ 12 మందిని స్వీయనిర్బంధంలో ఉంచారు.
అధికారులతో కలెక్టర్ సమావేశం
కరోనా ఉద్ధృతి పెరుగుతున్నందున జిల్లాస్థాయి ఉన్నతాధికారులు, వైద్యాధికారులతో కలెక్టర్ వెంకట్రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో తెరుచుకున్న ప్రతి దుకాణాన్ని ఎప్పటికప్పుడు క్రిమిసంహారక మందులతో పిచికారీ చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో ఉన్న పీపీయూనిట్ను ప్రత్యేకంగా కొవిడ్ జిల్లా ఆసుపత్రిగా ఏర్పాటు చేయాలని, ఎస్వీఎస్ ఆస్పత్రిలో ఐసోలేషన్ కేసులను చూసేందుకు కేటాయించాలని సమావేశంలో నిర్ణయించారు.
ఇవీ చూడండి:గంటల పాటు ఎండ ఉన్నా.. వైరస్ విజృంభణ!