కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలను జిల్లా అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. అక్కడికి ఎవరూ రాకుండా, అక్కడి నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు నాలుగువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించినందున దుకాణాలు మూసి ఉంచాలని జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా తెలిపారు. కంటైన్మెంట్ జోన్కు డిప్యూటీ వైద్యాధికారి సుధాకర్ నాయక్ను నోడల్ అధికారిగా నియమించామన్నారు.
జిల్లా కేంద్రంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రంలో వంద పడకలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. పైకాజీనగర్లో ర్యాండమ్గా నమూనాలు సేకరించాలని అన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు చేయాలని పేర్కొన్నారు. వాంకిడి క్వారంటైన్లో ఉన్న 26 మందిలో 17 మంది కోలుకున్నారని.... వారికి పరీక్షలు నిర్వహించి డిశ్ఛార్జీ చేయాలన్నారు. నీటి వసతి లేని ప్రాంతాల్లో బోర్లు వేయాలని కలెక్టర్ అన్నారు. బావులు, నీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.