కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ముంపు ప్రభావిత గ్రామాలను సందర్శించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నదాతలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోతున్న ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం బాధ్యతాయుతమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కంటితుడుపుగా కేవలం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తే సరిపోదన్నారు.
అక్కడ విద్యుత్ అంతరాయం ఉంది...
ప్రజలను ఆదుకునేందుకు క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని గ్రామాలకు రాకపోకలు, విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఇబ్బంది పడుతున్నారని సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. గంగాధర మండలంలో ముంపు గ్రామాలుగా ప్రకటించిన నారాయణపూర్, చర్లపల్లి, మంగపేట ప్రజలకు పరిహారం చెల్లించే హామీని ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని... అడిగిన వారిని అరెస్టు చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని లేని పక్షంలో ముంపు గ్రామాల ప్రజలతో కలిసి ప్రగతి భవన్కు వస్తామన్నారు. ప్రజల కన్నీళ్లతో ప్రాజెక్టులు నింపాలని ప్రభుత్వం భావిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : ఎడతెరిపిలేని వర్షాలు... మేడారాన్ని చుట్టేసిన వరద నీరు