తెలంగాణ

telangana

By

Published : Nov 4, 2022, 5:03 PM IST

ETV Bharat / state

'ఈ నెల 7న రాహుల్​ జోడో యాత్ర ముగింపు.. భారీ బహిరంగ సభ.. '

Revanth reddy review meeting: భారత్​ జోడో యాత్రకు రాష్ట్రంలో విశేష స్పందన వస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. రాహుల్​ యాత్రకు ప్రజలు అడుగడుగున నిరాజనం పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్​ షుగర్​ ఫ్యాక్టరీలో భారత్​ జోడోపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Revanth Reddy review on the success of Rahul Gandhi Bharat Jodo Yatra
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి

Revanth reddy review meeting: మునుగోడు ఉప ఎన్నికల సమయంలో జోడో యాత్ర తెలంగాణకు వచ్చినప్పటికీ.. యాత్రను విజయవంతం చేయడానికి నాయకులు ఎంతో కృషి చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి కొనియాడారు. ఇవాళ భారత్‌ జోడోయాత్రపై కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ షుగర్ ఫ్యాక్టరీలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన కాంగ్రెస్​ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి ఈ ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శిలు బోసురాజు, రోహిత్‌ చౌదరి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఆర్.దామోదర్ రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు.

సమీక్షా సమావేశంలో ఈ నెల 5, 6 తేదీలల్లో మాత్రమే తెలంగాణలో జోడో యాత్ర కొనసాగుతుందని, 5వ తేదీన సాయంత్రం కార్నర్ మీటింగ్ ఉంటుందని, 6వ తేదీన కార్నర్ మీటింగ్ ఉండదని రేవంత్​రెడ్డి వివరించారు. 7వ తేదీన వీడ్కోలు సమావేశం అద్భుతంగా చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అదే రోజున సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు రేవంత్‌ రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్‌ వద్ద కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి అడుగు పెట్టిన రాహుల్‌ గాంధీ భారత్‌ జోడోయాత్రకు తెలంగాణ సమాజం నుంచి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. రాహుల్ గాంధీకి అడుగడుగున అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల నేతలకు పాదయాత్రలో పాల్గొనే అవకాశం రాలేదన్నారు. ఈ నెల 7వ తేదీన రాత్రి సమయంలో రాహుల్ గాంధీ పాదయాత్ర ఉంటుందని, రాత్రి 9.30 గంటలకు దెగ్లూరులో మహారాష్ట్ర వారికి రాహుల్‌ను పరిచయం చేయబోతున్నట్లు నాయకులకు తెలిపారు. నాలుగు పార్లమెంట్ నియోజక వర్గాల నాయకులు ఈ మూడు రోజులు క్రియాశీల పాత్ర పోషించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాహుల్ యాత్ర కవరేజీ కాకుండా కుట్రలు చేసినా మీడియా మంచి కవరేజ్ ఇచ్చిందని రేవంత్‌ రెడ్డి కొనియాడారు.

భారత్​ జోడో యాత్రలో రాబోయే మూడు రోజులు అత్యంత కీలకం. యావత్​ తెలంగాణ ప్రజానికం కూడా రాహుల్​ జోడో యాత్రకు మద్దతు ఇచ్చారు. ఈ నెల 7వ తేదీన రాహుల్​ సభకు వీడ్కోలు సభ ఉంటుంది. అదే రోజు బహిరంగ సభ జరుగుతుంది. ఆ సమావేశంలో రాహుల్​ గాంధీ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. తెలంగాణలో భారత్​ జోడో యాత్ర ద్వారా తెలుసుకున్న సమస్యలను వివరిస్తారు.- రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

రేవంత్​రెడ్డి సమీక్షా సమావేశం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details