ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నీ జులైలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్లో విడుదల చేశారు. జులై 1 నుంచి 3 వరకు ఎంసెట్ ప్రవేశాల కోసం పీజీ ఈసెట్ నిర్వహించనున్నారు. డిప్లొమా పూర్తి చేసిన వారు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరేందుకు జులై 4న ఈసెట్ జరగనుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల కోసం.. జులై 6 నుంచి 9 వరకు రోజుకు రెండు సెషన్లలో ఎంసెట్ నిర్వహించనున్నారు.
మే 31 ఆలస్య రుసుము లేని గడువు:
ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీఎల్ సెట్ జులై 10న జరగనుంది. ఎంబీఎ, ఎంసీఎ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ యూనివర్సిటీ నిర్వహించే ఐసెట్... జులై 13న ఉంటుంది. బీఈడీ కోర్సుల కోసం జులై 15న ఎడ్సెట్ నిర్వహిస్తారు. బీపెడ్, డీపెడ్ వ్యాయామ కోర్సుల్లో ప్రవేశాల కోసం మహాత్మగాంధీ యూనివర్సిటీ నిర్వహించనున్న పీఈ సెట్ షెడ్యూలును జులై 16 తర్వాత ఖరారు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ప్రవేశాలకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 31తో ముగియనుంది. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిసెట్ను జులై 1న నిర్వహిస్తారు.
"అన్ని సంవత్సరాల పరీక్షలు ఒకేసారి నిర్వహిస్తే వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు సమస్య వస్తుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టల్స్ను కలిపి చూసుకుంటే దాదాపు లక్షకుపైగా విద్యార్థులు ఉంటున్నారు. వీళ్లందరికి కలిపి ఒకేసారి పరీక్షలు నిర్వహిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఆఖరు సంవత్సరం విద్యార్థులు ముఖ్యం కాబట్టి ముందుగా వారికి ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాం."