తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు పీసీసీ సమావేశం.. కమలానికి కళ్లెం వేసేందుకు సన్నాహాలు - TPCC meeting today

హైదరాబాద్ గాంధీ భవన్​లో నేడు పీసీసీ కార్యవర్గం సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఇరువురు ప్రతినిధులు హాజరై వివిధ అంశాలపై అవగాహన కల్పించనున్నారు.

కేంద్రంలోని భాజపాను ఢీ కొనేందుకు కాంగ్రెస్ వ్యూహాలు

By

Published : Oct 29, 2019, 5:07 AM IST

Updated : Oct 29, 2019, 7:29 AM IST

కేంద్రంలోని భాజపాను ఢీ కొనేందుకు కాంగ్రెస్ వ్యూహాలు

కేంద్రంలో భాజపా దూకుడుకు కళ్లెం వేసే దిశలో కార్యకలాపాలను విస్త్రృతం చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. రాష్ట్రాల్లో పీసీసీ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసి పాలనాపరమైన అంశాలపై ప్రత్యేక ప్రతినిధుల ద్వారా అవగాహన కల్పించనుంది. ఇవాళ గాంధీభవన్‌లో జరగనున్న పీసీసీ కార్యవర్గ సమావేశంలో అధిష్ఠానం తరఫున ఇద్దరు ప్రతినిధులు హాజరై వివిధ అంశాల గురించి వివరించనున్నారు. మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, త్వరలో జరగనున్న పుర ఎన్నికల అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ముఖ్య నాయకులతో ప్రత్యేక జట్టు ఏర్పాటు:

భాజపా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత.. ఆ పార్టీ దూకుడుకు కళ్లెం వేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు చేపట్టిన అనంతరం వివిధ అంశాలకు చెందిన నిపుణులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వంలో పాలనాపరమైన లోపాలను గుర్తించి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. 17 మంది ప్రత్యేక సలహాదారులను సోనియా నియమించారని.. వివిధ అంశాలపై వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు కాంగ్రెస్‌ పేర్కొంది. వారి సలహాల ఆధారంగా అన్ని రాష్ట్రాల్లో పీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమైన నాయకులతో కేంద్ర పాలనాపరమైన లోపాలతో పాటు ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, పరిశ్రమల మూసివేత తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు.

భాజపా సర్కార్​పై ఇక వరుస ఉద్యమాలు...

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ ఆర్సీ కుంతియా నేతృత్వంలో పీసీసీ కార్యవర్గం మధ్యాహ్నం సమావేశం కానుంది. ఏఐసీసీ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌, ఆర్థిక విశ్లేషకులు శ్రీనివాస రావులు సమావేశానికి హాజరై దేశ ఆర్థిక వ్యవస్థపై మాంద్యం ప్రభావాన్ని వివరించనున్నారు. పరిశ్రమలు క్రమంగా మూత పడుతుండటం, తద్వారా నిరుద్యోగుల సంఖ్య పెరగడం లాంటి అంశాలను వివరించనున్నారు. కేంద్రంలో భాజపా పరిపాలనపై విశ్లేషించనున్నారు. ఇప్పటికే మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఏఐసీసీ స్థాయిలో నాయకులకు అవగాహన కల్పించారు. కేంద్ర సర్కార్ పాలనపై పూర్తి స్థాయి అవగాహనతో వరుస ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఉత్తమ్‌ పేర్కొన్నారు. భాజపా ప్రభుత్వ ఆర్థిక విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తోందన్నారు.

ఇవీ చూడండి : 'రాముడిని నిత్యం స్మరించే భాజపా నిజం చెప్పాలి'

Last Updated : Oct 29, 2019, 7:29 AM IST

ABOUT THE AUTHOR

...view details