Telangana Assembly Elections Result 2023 Live News updates : తెలంగాణలో ఏ పార్టీ అధికారం చేపట్టనుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. శాసన సభ ఓట్ల లెక్కింపు జోరుగా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలైంది. 8.30గంటల తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,798 టేబుళ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 119 స్థానాల ఫలితాలు.. 2,417 రౌండ్లలో తేలనున్నాయి. మొదటి ఫలితం ఉదయం 10.30 ప్రాంతంలో తెలిసే అవకాశం ఉంది.
Published : Dec 3, 2023, 10:28 AM IST
Telangana Assembly Elections Result 2023 Live News updates : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు - ప్రత్యక్ష ప్రసారం!
Telangana Assembly Elections Result 2023 Live News updates : తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. రౌండ్ల వారీగా ఫలితాలు వెలువడుతున్నాయి. దీంతో.. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో క్షణక్షణం ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు ఈటీవీ భారత్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించండి.
తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరిగింది. ఒకే విడతలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 71.34 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మునుగోడు నియోజకవర్గంలో 91.89 శాతం పోలింగ్.. అత్యల్పంగా యాకుత్పురలో 39.64 శాతం పోలింగ్ నమోదైంది. బరిలో మొత్తం 2,290 మంది అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు 119 నియోజకవర్గాల్లోనూ పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ 118 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపింది. భారతీయ జనతా పార్టీ 111 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేశారు. సీపీఎం 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో నిలిచింది. ఎంఐఎం 9 నియోజకవర్గాల్లో.. 8 స్థానాల్లో జనసేన.. ఒక స్థానంలో సీపీఐ పోటీ చేశాయి.
కొత్తగూడెం నియోజకవర్గంలో పోటీచేసిన సీపీఐకి కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఈ రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి. అదేవిధంగా.. బీజేపీ-జనసేన సైతం పొత్తుతోనే ఎన్నికల బరిలోకి దిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పలువురు అభ్యర్థులు స్వతంత్రంగా పోటీలో నిలిచారు. మరికొద్ది సేపట్లో వీరి భవితవ్యం తేలనుండడంతో.. అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గతానికి భిన్నంగా ఈసారి పార్టీల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. ఎవరు నెగ్గుతారో.. ఎవరు ఓటమి పాలవుతారో అంచనా వేయడం పరిశీలకులకు కష్టంగా మారింది. దీంతో.. శాసనసభ ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వస్తుందోనని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫలితాల సరళిని క్షుణ్ణంగా పరిశీలించేందుకు టీవీలకు అతుక్కుపోయారు. ఈ నేపథ్యంలో.. క్షణక్షణం ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు "ఈటీవీ భారత్" ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించండి.