గాంధీ ఆసుపత్రిలో అక్కాచెల్లెళ్లపై జరిగిన అత్యాచార ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి నిన్నటి నుంచి తాము పోలీసులపై ఒత్తిడి తెస్తే.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పేర్కొన్నారు. అయినా ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదని విమర్శించారు. ఆచూకీ దొరకని మహిళ కోసం పోలీసులు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీకి వినతి పత్రం అందజేసినట్లు సునీతారావు పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెబుతున్న డీజీపీ.. మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాల నిరోధానికి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. గాంధీ ఆసుపత్రిలో నాలుగు రోజుల పాటు ఈ ఘటన జరిగితే.. సూపరింటెండెంట్ రాజారావు.. నిద్ర పోతున్నారా అని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను చూస్తుంటే భయమేస్తోంది. గాంధీ ఆసుపత్రి ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని హోం మంత్రికి వినతి పత్రం ఇచ్చాం. నాలుగు రోజుల పాటు బాధిత మహిళలపై అత్యాచారం జరిగితే.. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు నిద్రపోతున్నారా..?- సునీతారావు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు
ఇదీ జరిగింది..
గాంధీ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తోన్న ఉమా మహేశ్వర్ అనే వ్యక్తి తనపై, తన సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడని మహబూబ్నగర్కు చెందిన ఓ మహిళ ఆరోపించింది. ఈ మేరకు సోమవారం చిలకలగూడ పోలీస్స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది.