హైదరాబాద్ హరిత ప్లాజాలో అబ్కారీ అధికారుల సమావేశంలో పాల్గొన్న ఆ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తాటి నీరా ఉత్పత్తులపై సమీక్షించారు. రాష్ట్రంలోని నీరా, దాని అనుబంధ ఉత్పత్తుల తయారీకి సాంకేతికంగా అధ్యయనం చేసిన అనంతరం అధికారులు అందించిన నివేదికపై చర్చించారు. ఏపీ రాజమండ్రిలోని వైఎస్సార్ హార్టికల్చర్ వర్సిటీలో నీరా కమిటీ పర్యటించింది. ఇందులో భాగంగానే స్టడీ టూర్లో అధ్యయనం చేసిన వివరాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కల్లు గీత కార్మిక సహకార ఆర్థిక సంస్థ ఎండీ ఆలోక్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు. నీరా ఉత్పత్తి, సేకరణ, నిలువ చేయటం, అనుబంధ ఉత్పత్తుల తయారీ, నిల్వ కేంద్రం, ప్యాకింగ్ తదితర అంశాలపై మంత్రి దిశ నిర్దేశం చేశారు.
'ఉత్పత్తికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి'
తెలంగాణలో తాటి, దాని అనుబంధ కేంద్రాన్ని హార్టికల్చర్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వీలైనంత త్వరగా నీరా ఉత్పత్తకి ప్రణాళికలు రూపొందించాలని కోరారు. ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, అబ్కారీ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, అబ్కారీ శాఖ అదనపు కమిషనర్ అజయ్ రావు, ఎన్ఫోర్స్మెంట్ సహాయ కమిషనర్ హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.
'నీరా ఉత్పత్తి అధ్యయనం కోసం కేరళ, మహారాష్ట్రల్లో పర్యటించనున్న అధికారులు' ఇవీ చూడండి : 'పల్లె ప్రగతి'పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: మంత్రి ఎర్రబెల్లి