ప్లాస్టిక్ నిషేధం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. పర్యావరణాన్ని దెబ్బతీస్తూ, జీవకోటి మనుగడకే ముప్పుగా మారిన ప్లాస్టిక్ ఉత్పత్తి, అమ్మకాలను రాష్ట్రంలో నిషేధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధానాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ రాష్ట్రంలో ప్లాస్టిక్ను నిషేధించాలనే విషయమై విస్తృతంగా చర్చించారు. దీనిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు అధికారుల కమిటీని నియమించాలని కేబినెట్ నిర్ణయించింది.
సింగిల్ యూజ్
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం వల్ల వచ్చే సమస్యలు, ప్రత్యామ్నాయాలపై అధ్యయానికి కమిటీ ఏర్పాటు చేసిన సర్కార్... ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అవసరమైన సిఫారసులు చేయాలని కూడా కమిటీకి సూచించింది. వివిధ రాష్ట్రాల్లో నిషేధం అమలవుతున్న తీరును కూడా కమిటీ అధ్యయనం చేయనుంది.
కమిటీ ఏర్పాటు
అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన, పురపాలక, పంచాయతీరాజ్, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శులు, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ సభ్యులుగా, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి మెంబర్ కన్వీనర్గా కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఒకమారు వాడి పారవేసే ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి అధికారుల కమిటీ కసరత్తు జరుపుతోంది. ఈ ప్రక్రియ ఓ వైపు జరుగుతుండగానే... ప్లాస్టిక్ నిషేధం దిశగా ముఖ్యమంత్రి కార్యాలయం శ్రీకారం చుట్టింది.