మన మధ్య ఓ 30 గ్రాముల పక్షి బతకలేకపోతే మనం ఏం అభివృద్ధి సాధించినట్టని.. సమాజాన్ని నిలదీస్తాడు పక్షిరాజు. రోబో 2.O చిత్రంలోని ఈ డైలాగ్ ఆలోచింపజేసేదే. నేపథ్యం వేరైనా మనకూ.. ఉన్నాడు ఓ పక్షిరాజు. పశుపక్ష్యాదుల దాహర్తి తీరుస్తూ.. వాటి సంరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నాడు.
ప్రకృతి ప్రేమికుడు..
జహంగీర్కు ప్రకృతే ప్రపంచం. ఉదయం లేచింది మొదలు... పడుకునే వరకు ప్రకృతిలోని జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తుంటాడు. అలా అని...అతను శాస్త్రవేత్తో, అధ్యాపకుడో కాదు. ప్రకృతిని ప్రేమించే గొప్ప మనసున్న మామూలు మనిషి. సువిశాలమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోని క్యాంపు 5 బస్తీలో భార్య, ముగ్గురు పిల్లలతో జీవిస్తున్నాడు.
వేసవిలో ఓ రోజు జహంగీర్... ఓయూలో దాహం వేసి తన వద్ద ఉన్న సీసాలోని నీళ్లన్ని తాగాడు. తన వద్ద తాగడానికి నీళ్లున్నాయి... కానీ ఈ ప్రాంతంలో ఉన్న పక్షులు, జంతువులకు మండు వేసవిలో ఎవరు నీళ్ల ఇస్తారని ఆలోచించాడు. ఓయూలోని పశుపక్ష్యాదులకు నీళ్లు అందుబాటులో ఉంచాలని సంకల్పించాడు.