15వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు పంచాయతీల్లో గత ఏడాదికి సంబంధించి ఆడిటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో జిల్లా, రాష్ట్రస్థాయి ఆడిట్ అధికారులు గ్రామ పంచాయతీల్లో రికార్డులను పరిశీలించి అందులోని అభ్యంతరాలను వెల్లడించేవారు. ఈ ప్రక్రియలో రికార్డులు ఇవ్వకపోవడం తదితర సమస్యలు వచ్చేవి. పంచాయతీల్లో ఆడిటింగ్ వ్యవస్థను పక్కాగా అమలు చేయాలని, అనంతరం నివేదికలను ఆన్లైన్లో పొందుపరచాలని కేంద్రం సూచించింది.
బయటపడుతున్న లొసుగులు
దీనితో రాష్ట్రంలోని 12,765 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం ఆడిటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పంచాయతీల్లో ఇప్పటివరకు 3,277 ఆడిటింగ్ నివేదికలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో అనేక లొసుగులు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 36 వేల అభ్యంతరాలను ఆడిటింగ్ విభాగం గుర్తించింది.