KTR about Punjab Champion : తనకు ఉద్యోగంతో పాటు ఆర్థిక ప్రోత్సాహకం అందజేస్తామన్న హామీని పంజాబ్ ప్రభుత్వం విస్మరించిందని దివ్యాంగ చెస్ క్రీడాకారిణి మాలిక హండా ఆగ్రహం వ్యక్తంజేసింది. బదిర క్రీడాకారుల కోసం ఎలాంటి క్రీడా విధానం లేనందున తనకు సహాయం చేయలేకపోతున్నట్లు పంజాబ్ క్రీడల మంత్రి పర్గత్సింగ్ అన్నట్లు మలిక వాపోయింది. పంజాబ్ ప్రభుత్వాన్ని నమ్ముకుని అయిదేళ్ల సమయం వృథా చేసుకున్నానని ఆవేదన వ్యక్తంజేసింది. పంజాబ్కు చెందిన మాలిక హండా.. అంతర్జాతీయ బదిరుల చెస్ ఛాంపియన్షిప్లో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ప్రపంచ, ఆసియా ఛాంపియన్షిప్లలో ఆరు పతకాలు సాధించింది. జాతీయ బదిరుల చెస్ ఛాంపియన్షిప్లో ఏడు సార్లు విజేతగా నిలిచింది. ఉద్యోగం, నగదు బహుమతి విషయంలో రెండు నెలలుగా పంజాబ్ ప్రభుత్వం ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నట్లు గత ఏడాది నవంబరులో మాలిక ట్వీట్ చేసింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో ఆదివారం మరో వీడియో పోస్ట్ చేసింది. డిసెంబరు 31న క్రీడల మంత్రి పర్గత్సింగ్ను కలవగా.. బదిర క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా క్రీడా విధానం లేకపోవడంతో ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదని చెప్పినట్లు 25 ఏళ్ల మాలిక వాపోయింది.
క్రీడాకారిణి ఆగ్రహం
‘‘బహుమతి ఎందుకు ప్రకటించారని మాత్రమే అడుగుతున్నా. పంజాబ్ ప్రభుత్వాన్ని నమ్ముకుని అయిదేళ్లు వృథా చేసుకున్నా. వాళ్లు నన్ను మోసం చేశారు. బదిర క్రీడాకారుల్ని పట్టించుకోవట్లేదు. తనను ఆదుకుంటామని జిల్లా నాయకులు ఈ అయిదేళ్లు హామీ ఇస్తూ వచ్చారు. కానీ ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. పంజాబ్ ప్రభుత్వం ఎందుకిలా చేస్తోంది?’’ అని మాలిక ఆగ్రహం వ్యక్తంజేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఒక స్వర్ణం, రెండు రజతాలు గెలిచిన సమయంలో మాలికకు ప్రభుత్వ ఉద్యోగం, నగదు ప్రోత్సాహకం అందిస్తామని అప్పటి పంజాబ్ క్రీడల మంత్రి ఆమెకు హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వ హామీని పాలకులు నిలబెట్టుకోకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేస్తుందని మాలిక ఆవేదన వ్యక్తం చేస్తోంది.